HYDRAA: హైదరాబాద్ లో హైడ్రా ఉక్కుపాదం మోపింది. చెరువులను ఆక్రమించి చేపట్టిన కట్టడాలను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది. ఇప్పటి వరకూ.. హైదరాబాద్ పరిధిలో 43 ఎకరాల్లో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలన్నింటినీ కూల్చివేసినట్లు హైడ్రా అధికారులు ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు.
మొత్తం 18 ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజ్, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ రావు లకు సంబంధించిన ఆక్రమిత కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. గాజులరామారం, అమీర్ పేట్, చందానగర్, రాజేంద్రనర్, బాచుపల్లి, బోడుప్పల్, గండిపేట, మాదాపూర్ లలో అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. మణికొండలోని చిత్రపురి కాలనీలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా నోటీసులిచ్చింది. 225 అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.
Also Read: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మాస్టర్ మైండ్, హైడ్రా బాస్ ఈయనే.. హైద్రాబాద్ క్లీన్ చేయడమే లక్ష్యం
ఇప్పటికే టాలీవుడ్ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా నేలమట్టం చేసిన హైడ్రా దృష్టి ఇప్పుడు కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫాంహౌస్ పై పడింది. జీవో నంబర్ 111కు విరుద్ధంగా జన్వాడ ఫాంహౌస్ ను నిర్మించారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. వాటన్నింటినీ పరిశీలించి ఫాంహౌస్ ను కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.
మరోవైపు హైడ్రా తరహా వ్యవస్థను మరిన్ని నగరాల్లో ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, నల్లగొండ, గద్వాల, కామారెడ్డి సహా పలు నగరాలు హైడ్రా విస్తరణకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పట్టణాల్లో చెరువులు, శిఖం భూములు, బఫర్ జోన్లలో అడ్డగోలుగా నిర్మాణాలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో.. చెరువులు, కుంటల రక్షణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం హైడ్రా వంటి వ్యవస్థతో వాటిని సంరక్షించాలని భావిస్తోంది.