Shadnagar MLA Veerlapally Shankar About HYDRA: తెలంగాణలో హైడ్రా పేరు మార్మోగుతోంది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా షాద్ నగర్ ప్రాంతంలో హైడ్రా అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తామని చెప్పడంతో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు నియోజకవర్గంలో కొన్ని నీటి వనరులను ధ్వంసం చేసి అక్రమాలకు పాల్పడిన వ్యవహారాలను కూడా వెల్లడించడంతో ఇక షాద్ నగర్ నియోజకవర్గంలో హైడ్రా రాక కోసం మార్గం సుగమం చేస్తున్నట్లు తెలుస్తుంది.
హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా విధానాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేకెత్తుతున్నాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రభుత్వం ఎంతో గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అమలు చేస్తుండడం విశేషమన్నారు. ఏ ప్రభుత్వం చేయని ధైర్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శించారని అభినందించారు. హైడ్రా తీసుకొచ్చి అక్రమ కట్టడాలను కూల్చుతూ చెరువులు కుంటలను ఫీడర్ ఛానల్స్ ను కాపాడుతున్న తీరును ఆయన ప్రశంసించారు.
హైడ్రా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, హైడ్రాకు సంబంధించి అధికారి రంగనాథ్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే నీటి వనరులను, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని గుర్తు చేశారు.
షాద్నగర్ నియోజకవర్గంలో కూడా నీటి వనరులను ధ్వంసం చేశారని ఎమ్మెల్యే శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ నుంచి నియోజకవర్గంలోని రెడ్డిపాలెం వరకు వచ్చే ఫిరంగి కాల్వను కూడా మొత్తం ధ్వంసం చేసి అక్రమ కట్టడాలు నిర్మించి నీటి వనరులకు సమస్య సృష్టించారని ఎమ్మెల్యే పలు విషయాలు చెప్పారు. ఫిరంగి కాల్వపై గతంలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఎన్నో ఫిర్యాదులు కూడా చేశారని గుర్తుచేశారు. అదేవిధంగా ఫరూక్ నగర్లోని బొబ్బిలిచెరువు భూమిలో కూడా అక్రమ కట్టడాలు జరిగాయని వాటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు.
అక్కమ చెరువు, అంచు కుంట చెరువులు గత పాలకుల, రియాల్టర్ల లాభాపేక్షకు కబ్జాలకు గురయ్యాయని, ఈ కారణంగా నీటి వనరులకు ఎంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు కోకోలలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో చెరువులు కుంటలు కబ్జా చేసిన దాఖలాలు ఉన్నాయని, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కట్టారని, వాటిని తీసిపారేసే విధంగా హైడ్రా ఇక్కడ అమలు చేయాలన్నారు. ఇందులో భాగంగానే హైడ్రాను విస్తరించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Also Read: హైడ్రా కూల్చివేతలపై స్పందించిన మంత్రి పొన్నం.. ఏమన్నారంటే..?
షాద్నగర్లో హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గంలో హైడ్రాను యథేచ్ఛగా అమలు చేస్తామని ఎమ్మెల్యే శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వెంట పీసీసీ సభ్యులు మహమ్మద్ అలీఖాన్ బాబర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగదీశ్వరప్ప, చల్లా శ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, చెంది తిరుపతి రెడ్డి, గూడ వీరేశం, హరినాథ్ రెడ్డి, సయ్యద్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు..