Hydra Commissioner Sensational Comments: హైడ్రా అంటే బూచి కాదు.. రాక్షసి అంతకన్నా కాదు.. లక్షలాది మంది క్షేమం కోసం పాటుపడేదే హైడ్రా. నేను సైలెంట్ కాదు.. గ్రౌండ్ వర్క్ జరుగుతోంది.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోకి వచ్చే ఏ కట్టడాన్ని వదిలేది లేదు.. బుచ్చమ్మ ఆత్మహత్య నన్ను ఎంతగానో కలచి వేసింది.. పెద్దలు వెనుక ఉండి, పేదలను ముందుకు పంపుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు… హైడ్రా కమిషనర్ రంగనాథ్.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు, చెరువులను కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో హైడ్రా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కాగా మూసి పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలను కూల్చి వేసేందుకు అధికారులు రెడ్ మార్క్ సైతం వేశారు. దీనిపై తన ఇంటిని కూల్చి వేస్తారేమోనన్న భయంతో బుచ్చమ్మ అనే వృద్దురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు హైడ్రా కమీషనర్ రంగనాథ్ సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ… హైడ్రాను వ్యతిరేకంగా చూపించే సమయంలో మీడియా ముందుగా ఆలోచించాలన్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో.. ఆ ఇంటి యజమానులను బాధితులుగా తెలుపుతున్నారని.. వరదల సమయంలో అక్రమ కట్టడాల వల్ల నగరాలు నీటిమునిగితే అప్పటి బాధితుల సంగతి ఏమిటి అంటూ ప్రశ్నించారు. పలువురు బిల్డర్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని, తాము నోటీసులు ఇచ్చే క్రమం నుండి.. కూల్చివేతల వరకు ప్రతిదీ రికార్డు చేస్తున్నట్లు తెలిపారు.
సున్నం చెరువులో కిరోసిన్ పోసుకున్న వెంకటేష్ అనే యువకుడు రోజుకు లక్ష రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నట్లు, అతను ట్యాంకర్ల వ్యాపారం చేస్తున్నట్లు తాము గుర్తించమన్నారు. రోజుకు లక్ష రూపాయలు సంపాదించేవారు పేదలవుతారా అంటూ రంగనాథ్ ప్రశ్నించారు. జిహెచ్ఎంసి అనుమతులు ఉంటే తాము వాటి జోలికి వెళ్లట్లేదని.. అయితే ముందస్తుగా తాము సమాచారం ఇస్తే కొందరు సీరియస్ గా తీసుకోవట్లేదన్నారు. మరికొందరు ముందస్తుగానే ఖాళీ చేస్తూ.. తమకు సహకరిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Kavitha Missing: కవిత కనబడుటలేదు.. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు
బఫర్ జోన్, ఎఫ్టిఎల్ పరిధిలో పేదలు నివసిస్తూ ఉంటే వారికి తగిన సమయం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తమకు సూచించారన్నారు. హైడ్రా పరిధి దాటడం లేదని.. చెరువుల్లో గృహాలు కట్టుకుంటే వర్షాల సమయంలో లక్షల మందికి నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తాము కూల్చివేసే ప్రతి భవనం ఖాళీ గృహాలు గానే ఉంటున్నాయని.. అయితే రాత్రికి రాత్రి వచ్చి నివాసం ఉంటున్నట్లు తాము గుర్తించామన్నారు.
ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన కళాశాలల పట్ల తమకు ఫిర్యాదులు అందుతున్నాయని.. అకాడమిక్ ఇయర్ పూర్తికాగానే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. పెద్దవాళ్లే మా టార్గెట్.. కానీ వారు పేదవాళ్లను ముందుకు నెట్టి చోద్యం చూస్తున్నట్లు తెలిపారు. చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని, సరైన సమయంలో అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చేస్తామంటూ రంగనాథ్ తెలిపారు.
కాగా హైడ్రా చర్యల పట్ల ఓ వర్గం ప్రజల ఆదరణ లభిస్తోంది. వరదల సమయంలో అంతా కోల్పోవడం కన్నా.. హైడ్రా పరిధిలోకి వచ్చే గృహాలను కూల్చడం మేలని, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న అక్రమ కట్టడాల కూల్చివేత నిర్ణయం ఒక చారిత్రాత్మకమని ప్రజలు తెలుపుతున్నారని కమిషనర్ తెలిపారు.