Young Man Death: మరణం.. మృత్యువు.. చావు.. ఇలా ఎన్ని నానర్థాలు చెప్పినా.. చివరికి దీని జాడ తెలియడం మాత్రం కష్టమే. మనిషికి మృతువు ఏ సమయంలోనైనా, ఎలాగైనా దరిచేరవచ్చు. అందుకే కాబోలు మానవుని పుట్టుక తేదీ చెప్పగలం కానీ, మరణ తేదీ ముందుగా చెప్పలేం. అయితే ఇలాంటి ఘటనే హైదరాబాబ్ నగరంలో చోటుచేసుకుంది. ఫ్రెండ్స్ తో సరదా సమయాన్ని వెచ్చించాలనుకున్న ఆ యువకుడికి, మృత్యువు ఓ కుక్క రూపంలో కబళించింది. అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఉదయ్ (23) తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పరిధిలోని రామచంద్రాపురం అశోక్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. అయితే తన స్నేహితులతో సరదాగా సమయాన్ని వెచ్చించే ఉదయ్.. ఆదివారం చందానగర్ లోని వివి ప్రైడ్ హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నారు. అనంతరం తన స్నేహితులకు హోటల్ రూమ్ వద్దకు రావాలని ఉదయ్ ఫోన్ చేసి చెప్పాడు. ఇక అంతే స్నేహితులు వచ్చే క్రమంలో, ఉదయ్ హోటల్ లోని మూడవ అంతస్తులోకి వెళ్లాడు.
అప్పటికే ఓ పెంపుడు కుక్క అక్కడ నిలబడి ఉదయ్ కు కనిపించింది. వెంటనే ఉదయ్ కొంత భయాందోళనకు గురై, పరుగులు తీశాడు. దీనితో కుక్క సైతం వెంట పడగా, చివరికి మూడవ అంతస్తు బాల్కనీ వైపుకు పరుగులు తీసి ఎటూ తోచక, కుక్క కరుస్తుందేమోనన్న భయంతో కిటికీలో నుండి దూకాడు. దీనితో ఉదయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఉదయ్ పరుగులు తీసి, కిటికీలో నుండి కింద పడ్డ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కాగా, వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు.
AlsoRead: Jagtial Congress Leader Incident: కారుతో గుద్ది, కత్తితో పొడిచి.. కాంగ్రెస్ నేత దారుణ హత్య
స్నేహితులతో సరదాగా గడిపేందుకు, హోటల్ గది బుక్ చేసుకున్న ఉదయ్.. చివరికి శునకంపై ఉన్న భయంతో మృత్యువు చెంతకు చేరగా.. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందివచ్చిన తమ కుమారుడు మృతి చెందడంతో, ఆ తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిది. కానీ హోటల్ రూమ్ ల వద్దకు ఆ శునకం ఎలా వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.