Hyderabad: ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం వెళ్లింది. కానీ అక్కడ జరిగిన ఓ ఘటన.. తనను డిప్రెషన్కు గురయ్యేలా చేసింది. దిక్కుతోచని స్థితిలో చికాగో రోడ్లపై ఆమె ఆకలితో అలమటిస్తూ తిరుగుతోంది. ఇది అమెరికాలో ఉంటున్న హైదరాబాద్ యువతి గాథ. కుమార్తె పరిస్థితి తెలుసుకున్న యువతి తల్లి.. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్కు లేఖ రాశారు. తన కుమార్తెను భారత్కు రప్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ మౌలాలికి చెందిన సయ్యదా లులు మిన్హాజ్ జైదీ.. డెట్రాయిట్లోని ట్రినీ వర్శిటీలో మాస్టర్స్ చేసేందుకు 2021లో అమెరికా వెళ్లింది. వెళ్లినప్పటి నుంచి మిన్హాజ్.. రోజూ తమతో మాట్లేదని యువతి తల్లి తెలిపింది. కానీ 2 నెలలుగా ఆమె నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని వాపోయింది. కుమార్తె వస్తువులు ఎవరో అపహరించారని.. దానివల్ల డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని అక్కడ ఉండే హైదరాబాద్ యువకులు చెప్పినట్లు తెలిపింది. బిక్కుబిక్కుమంటూ ఆకలితో రోడ్లపై తిరుగుతున్నట్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాలన్నింటినీ లేఖలో వెల్లడించింది. వాషింగ్టన్ DCలోని భారత రాయబార కార్యాలయం, చికాగోలోని భారత కాన్సులేట్ జోక్యం చేసుకుని తన కుమార్తెను తిరిగి తీసుకురావాలని లేఖలో వేడుకుంది ఆ తల్లి.