Hyderabad Polling | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారైనా ఓటర్లు కదులుతారా? ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తారా? పోలింగ్ రోజు సెలవుగా భావించి ఇళ్లకే పరిమితం అవుతారా? వాళ్లు కదలకపోవడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కాలేకపోతున్నామని గుర్తిస్తారా? ఓటు వేయడం బాధ్యతగా భావిస్తారా? గత ఎన్నికలను పరిశీలిస్తే మహానగరం పరిధిలో 50 శాతం ఓటింగ్ దాటకపోవడం కలకలం రేపుతోంది.
Hyderabad Polling | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారైనా ఓటర్లు కదులుతారా? ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తారా? పోలింగ్ రోజు సెలవుగా భావించి ఇళ్లకే పరిమితం అవుతారా? వాళ్లు కదలకపోవడం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కాలేకపోతున్నామని గుర్తిస్తారా? ఓటు వేయడం బాధ్యతగా భావిస్తారా? గత ఎన్నికలను పరిశీలిస్తే మహానగరం పరిధిలో 50 శాతం ఓటింగ్ దాటకపోవడం కలకలం రేపుతోంది. ఫలితంగా తక్కువ మంది నిర్ణయంతోనే అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో మహేశ్వరం, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, గోషామహల్, అంబర్పేట్, ముషీరాబాద్, ఉప్పల్, కూకట్పల్లి, కుత్భుల్లాపూర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్లో 50 శాతం మించగా.. మిగతా నియోజకవర్గాల్లో అయితే 50 శాతం లోపే పోలింగ్ జరగడం కలకలం రేపుతోంది. ఈసారైనా భారీగా పోలింగ్ జరిగేలా అధికారుల చర్యలు చేపట్టారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పోలింగ్ శాతం పెరిగితే గెలుపోటములపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి కొత్త ఓటర్ల సంఖ్య బాగా పెరిగడం పార్టీలను టెన్షన్ పెట్టిస్తోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 1కోటి 9 లక్షల మందికి పైగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హైదరాబాద్ పరిధిలో పోలింగ్ శాతం సగానికి మించడంలేదు. పోలైన ఓట్లలో సగం వచ్చిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోక పోవడం వల్లే ఇలాంటి పరిస్థితులకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యావంతులు, ఉద్యోగులు ఓటు వేయకపోవడం వల్ల ఫలితాలు వన్సైడ్గా వస్తున్నాయి. కొందరి నిర్లక్ష్యం ఫలితంగా సమాజం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రం మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికార పగ్గాలు చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 60. అందులో గ్రేటర్ పరిధిలో ఉన్న 24 సీట్లు అత్యంత కీలకంగా మారాయి. ఇంత కీలకమైన చోట్ల జనం ఓటు వేసేందుకు చైతన్యం చూపించడం లేదు. గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు పోలింగ్ 55 శాతానికి మించలేదు. చాలా చోట్ల 50 శాతం కూడా రీచ్ కాలేదు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈసారి యువ ఓటర్లు భారీగా పెరిగారు. 2,71,084 కొత్త ఓట్లు నమోదయ్యారు. హైదరాబాద్ పరిధిలో 77,522, రంగారెడ్డి జిల్లాలో 92,540, మేడ్చల్-మల్కాజిగిరిలో 1,01,022 కొత్త ఓట్లు పెరిగాయి. పాతబస్తీతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది. వీళ్లలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ముషీరాబాద్, అంబర్పేట్, ఉప్పల్ మినహా సనత్నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, మహేశ్వరంలో ప్రభావం చూపనున్నారు. గ్రేటర్ పరిధిలో గత పర్యాయం అధికార బీఆర్ఎస్ 14 సీట్లు దక్కించుకుంది. 2014లో 3 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 2018లో మహాకూటమి పొత్తులో భాగంగా 21 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎల్బీనగర్, మహేశ్వరంలోనే మాత్రమే గెలిచింది. 2009లో గ్రేటర్లోని 24 చోట్ల పోటీ చేసి 14 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ గత ఎన్నికల్లో గోషామహల్లో మాత్రమే దక్కించుకుంది. 2014లో గోషామహల్, ముషీరాబాద్, అంబర్పేట్, ఛైరతాబాద్, ఉప్పల్లో విజయం సాధించింది. మరి ఈసారి భారీగా పోలింగ్ జరిగితే ఫలితాలు పూర్తిగా తారుమారు కానున్నాయి.
గ్రేటర్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రముఖ బైక్ రెంటల్ సర్వీస్ రాపిడో సైతం ఉచిత రైడ్ ఆఫర్ చేసింది. నగరం పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లకు ఫ్రీ డ్రాపింగ్ సదుపాయం కల్పించింది. గ్రేటర్ పరిధిలో పోలింగ్ శాతం పెరిగితే గతానికి భిన్నంగా తీర్పు వచ్చే చాన్సెస్ ఉంటాయని పార్టీలు అంచనా వేస్తున్నాయి. సగం మంది ఓట్లు వేయడం అందులో పావు శాతం మంది అభిప్రాయంతో అభ్యర్థలు ఎన్నిక కావడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమనే చర్చ జరుగుతోంది. పోలింగ్ అనగానే సెలవు రోజు అని భావించకుండా భావితరాలకు భవిష్యత్ను అందించే బాధ్యతా యుతమైన సమయమని గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యే వ్యక్తికి ఎక్కువ మంది మద్దతు ఉంటేనే అది సరైన నిర్ణయమనే వాదనలు ఉన్నాయి. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి అలాంటి వాడు.. ఇలాంటి వాడు అని ఇంట్లోనే కూర్చొని ఓ అభిప్రాయానికి రాకుండా పోలింగ్ బూత్కు వచ్చి నిర్ణయాన్ని తెలియజేయాలి. హా మనం ఒక్కరం ఓటు వేయకపోతే ఏమవుతుందని అనుకుంటే.. అందరూ అలాగే భావిస్తే అసలు ఎన్నికల ప్రక్రియ అనేది ఉంటుందా అనేది ఆలోచించాలి. మనం ఒక్కరం.. అందరం కదిలితే సమూహం అనే నిజాన్ని గుర్తించాలి. ఓటు వేసేందుకు భాగ్యనగర వాసులు ముందుకు కదలాలి.
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై నగర పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు 400కు పైగా ఉన్నట్లు తేల్చారు. 90 శాతం కంటే ఎక్కువ.. 10 శాతం కంటే తక్కువ పోలింగ్ జరిగితే సమస్యత్మాకమైనవిగా గుర్తిస్తారు. అలాగే పోలైన ఓట్లలో 75 శాతం ఒకే అభ్యర్థికి పడిన ప్రత్యేకంగా దృష్టిపెడతారు. గతంలో పోలింగ్ రోజు హింస జరగడం.. ఓటర్ గుర్తింపు కార్డులు లేకుండా ఎక్కువ ఓట్లు పడినా ప్రత్యేక కేటగిరీలో చేరుస్తారు. అలాంటి పోలింగ్ స్టేషన్ల దగ్గర మహిళా పోలీసులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. స్థానిక పోలీసులతో పాటు రాష్ట్ర, కేంద్ర సాయుధ బలగాలను అదనంగా మోహరించారు. రూట్ మొబైల్స్, పెట్రోలింగ్ వాహనాలతో ప్రత్యేక దృష్టి పెట్టారు. టాస్క్ఫోర్స్, స్పెషల్ ఫోర్సెస్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మోహరించారు. అవసరమైతే అడిషనల్ ఫోర్స్ను రంగంలోకి దింపేందుకు సిద్ధంగా ఉంచారు.