Hyderabad News Updates(Telangana News): సికింద్రాబాద్లోని కళాసిగూడలో దారుణం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. మ్యాన్హోల్లో పడి ముక్కుపచ్చలారని చిన్నారి మరణించింది. నోరు చెరుచుకున్న నాలాలో పడి నాలుగో తరగతి చదువుతున్న మౌనిక కొట్టుకుపోయింది.
పాల ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లింది మౌనిక. కానీ ఎంత సేపైనా ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులను పాపను వెతికే క్రమంలో డీఆర్ఎఫ్ సిబ్బంది నాలాలో కొట్టుకు వచ్చిన పాప మృతదేహాన్ని పార్క్లైన్ దగ్గర కనిపెట్టారు. ఒక్కసారిగా తమ చిన్నారిని విగతజీవిగా చూసి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. తమ పాప ఇక లేదన్న వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్నారి మృతితో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
తెల్లవారుజాము నుంచి కళాసిగూడలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. రోడ్లపై వర్షపునీరు పారుతోంది. డ్రైనేజీ పనులు జరుగుతుండటంతో మ్యాన్ హోల్ మూత తెరిచి ఉంచారు. అది గమనించని చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా అందులో పడింది. ఊపిరాడక మృతి చెందింది. కిరాణ షాపునకు పాల పాకెట్ కోసం వెళ్లగా..ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని DRF సిబ్బంది గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఘటనపై స్పందించారు నగర మేయర్ విజయలక్ష్మి. కళాసిగూడకు వెళ్లారామె. రోడ్ రిపేర్లు జరుగుతున్న ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు ఎందుకు పెట్టలేదని అధికారులను ప్రశ్నించారు. రిపేర్ల కోసం రోడ్డును తవ్వినా.. వాటర్ వర్క్స్ వాళ్లు ఆగమంటే.. వెంటనే రోడ్డు వేయలేకపోయామన్నారు మేయర్. అక్కడ హెచ్చరిక బోర్డులు పెడితే.. స్థానికులు తీసేసినట్టు ఆమె చెప్తున్నారు. పాప కుటుంబానికి 2 లక్షల పరిహారం ప్రకటించారు.
హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తెలంగాణలో రానున్న 48 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించింది.