TSRTC : సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల సౌకర్యం కోసం 4,484 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. దీనిలో భాగంగా 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించింది. ఈనెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు, మహాలక్ష్మీ పథకం అమలు తీరుపై , ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం బస్ భవన్లో ఉన్నతాధికారులు, ఆర్ఎంలతో సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మీ స్కీమ్ అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్లో రద్దీ ప్రదేశాలు అయిన ఆరాంఘర్, ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, బోయిన్పల్లి, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరు డీవీఎం ర్యాంక్ అధికారులను ఇన్ఛార్జిలుగా నియమించామని తెలిపారు.
సంక్రాంతి పండుగకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో అదనపు చార్జీలు విధించబోమని పేర్కొన్నారు. ఏపీకి షెడ్యూల్ సర్వీసులతో పాటు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను కూడా నడుపుతామని సజ్జనార్ ప్రకటించారు. పండుగ సందర్భంగా బస్సు ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదని సృష్టం చేశారు. గతంలో మాదిరిగానే సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు ప్రకటించారు. సంక్రాంతికి నడిపే ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలు విధిగా జీరో టికెట్లు తీసుకొని ప్రయాణించాలని సజ్జనార్ తెలిపారు.