Traffic Control Measures In Hyderabad: హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి దృష్టి సారించారు. గొడవలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాలకు గురైన వారికి వెంటనే సత్వర సహాయం అందించేందుకు సీపీ శ్రీనివాస్ 108 ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని విద్యార్థులు, యువత, ఆటో, లారీ ట్రక్, కార్ డ్రైవర్స్ ప్రతి ఒక్కరికీ రోడ్డు ప్రమాదాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 150 కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా 35 వేల మందికి పైగా హాజరయ్యారని తెలిపారు. హైదరాబాద్లోని రోడ్ సేఫ్టీ ఫెస్టివల్ (Road Safety Festival) 2024లో భాగంగా పాత బస్తీ నుంచి మొదలుకొని హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలతో పాటు రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు.
Read More: మేడిగడ్డ బాటలోనే అన్నారం బ్యారేజీ.. పిల్లర్ల కింది నుంచి వాటర్ లీక్
హైదరాబాద్లో సీపీ శ్రీనివాస్ ప్రారంభించిన 108 ట్రాఫిక్ మొబైల్ బైకులు హైదరాబాద్ అంతటా తిరగనున్నాయి. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని వెంటనే కాపాడేందుకు, ట్రాఫిక్ రద్దీ కారణంగా అంబులెన్స్లు ట్రాఫిక్లో చిక్కుకుపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందుకే ట్రాఫిక్ మొబైల్ పోలీసులకు సీపీఆర్, ప్రథమ చికిత్సపై వైద్యుల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించారని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో అవసరం పడుతుందని, ట్రాఫిక్ సమస్యలపై అవగాహన ఉన్న పోలీసులకు మాత్రమే ట్రాఫిక్ మొబైల్ ద్విచక్ర వాహనాల బాధ్యతలు అప్పజెప్పినట్లు వెల్లడించారు. 108 వాహనాలు నిరంతరం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తిరుగుతాయని ఎక్కడ, ఎలాంటి సమస్య వచ్చినా, గొడవలైనా అయిన క్విక్ రియాక్షన్ టీం లాగా మొబైల్ పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు. వెహికల్స్ పాతవి అయినా అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దారని సీపీ అన్నారు.
హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రూల్స్ని ప్రతి ఒక్కరు ఫాలో కావాలని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ సూచించారు. నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు పార్కింగ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని, రూల్స్ ఫాలో కాకుంటే చలన్ వేసి ముక్కుపిండి వసూలు చేస్తామని సీపీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంత పెద్దవాడైనా సరే ఎవ్వరినీ వదలే ప్రసక్తేలేదన్నారు.
గూడ్స్ వాహనాల వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని, వాటికి కేటాయించిన సమయంలో మాత్రమే రావాలన్నారు. అలా కాకుండా మిగతా సమయంలో వస్తే చలన్స్ వేస్తామన్నారు. త్వరలో ట్రాఫిక్పై కొత్త రెగ్యులేషన్స్ తీసుకురానున్నారని, ట్రాఫిక్ లెస్ సిటీగా హైదరాబాద్ మారనుందని సీపీ అన్నారు.