Hyderabad: ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలపై… సీఎం కేసీఆర్ స్పందించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతిపై మాట్లాడే బీజేపీ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని మండిపడ్డారు. సీఎం కాకముందు కేసీఆర్ ఆస్తులెన్ని? ఇప్పుడు ఎన్ని ఉన్నాయో బయపెట్టాలని డిమాండ్ చేశారు.
రాహుల్గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి మోదీ గారు అంటూ పోస్ట్కార్డుపై ప్రశ్నావళి సంధించారు. అదానీకి బీజేపీకి ఉన్న సంబంధమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ బీజేపీకి ఎంత ఫండ్ ఇచ్చారో చెప్పాలంటూ లెటర్లలో పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంపై విపక్షాలన్నీ కలిసి పోరాడాలని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో కేసీఆర్ విపక్షాలను బతకనివ్వడం లేదని ఆమె అన్నారు. పేపర్ లీక్ సహా ఏ సమస్యపైనా ఆందోళన చేపట్టినా అణచివేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యానికే ముప్పుగా మారిందన్నారు. ప్రతిపక్షాలు ఏకమైతేనే కేసీఆర్పై పోరాటం సాధ్యమవుతుందని చెప్పారు.
రాష్ట్రంలో పదో తరగతి పేపర్ లీక్ కావడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నా పత్రాల లీకేజీ సర్వసాధారణమైందని అన్నారు. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోందని ఎద్దేవా చేశారు. పదో తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని స్థితిలో కేసీఆర్ సర్కార్ ఉందని అన్నారు.
పదో తరగతి ప్రశ్నప్రతం బయటకు రావడంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎ.శ్రీదేవసేన తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేశారని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కె.గోపాల్, ఇన్విజిలేటర్లు ఎస్.బందెప్ప, సమ్మప్పపై సస్పెన్షన్ వేటు వేశారని వెల్లడించారు.
టెన్త్ పేపర్ లీక్ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హైదరాబాద్లోని SSC బోర్డు ఆఫీస్ను ముట్టడించిన NSUI నాయకులు… లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని నినాదాలు చేసారు. SSC కార్యాలయ బోర్డు, గేట్లు ధ్వంసం చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కాంగ్రెస్ అగ్రనేతలపై బీజేపీ నేతలు విడుదల చేసిన వీడియోలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. వెంటనే బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవి, NSUI నేత బల్మూరి వెంకట్ డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
A.M.V.I పరీక్షలను రద్దు చేయాలని అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు ఆందోళన చేశారు. ఈ నెల 23న పరీక్ష ఉంటుందని చెప్పిన TSPSC… పేపర్ లీక్ తర్వాత ఏ విషయం స్పష్టంగా చెప్పడం లేదని చెబుతున్నారు. పరీక్ష గురించి TSPSC కార్యాలయంలో సంప్రదించినా… ఎవరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంచలనం సృష్టించిన స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు.. గ్రేటర్ కమిషనర్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. అగ్నిప్రమాదంపై తగిన కారణాలు తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 26 కు వాయిదా వేసింది.