Hyderabad ORR : హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. రింగ్ రోడ్డుపై వాహనాల రద్దీగానే ఉంటున్నా.. ORR సర్వీసు రోడ్లు, వాటి చుట్టుపక్కల ప్రాంతాలు చీకటి మయంగా ఉండడంతో నేరాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ORR సర్వీసు రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో.. పోలీసుల పెట్రోలింగ్ లేకపోవడంతో మృగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు.
2019లో ORR సర్వీసు రోడ్డు పక్కనే దిశ ఘటన జరిగింది. అప్పట్లో సంచలనం రేపిన ఈ ఘటన తర్వాత పోలీసులు ORR సర్వీసు రోడ్ల చుట్టుపక్కల ప్రాంతాలపై కాస్త నిఘా పెట్టినప్పటికీ.. తర్వాత కాలంలో తగ్గిపోయింది. దీంతో పలు అసాంఘీక కార్యకలాపాలు, నేరాలకు నిలయమవుతోంది. గురువారం రాత్రి కూడా శంషాబాద్ పరిసరాల్లో ఇలాంటి ఘటనే జరిగింది.
కొనాళ్ల క్రితం సంచలనం సృష్టించిన దిశ ఘటన మాదిరి దారుణమే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను హత్య చేసి.. పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. సైబరాబాద్ కమిషనరేట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. శ్రీనివాస కాలనీలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. మహిళను హత్యచేసి పెట్రోల్ పోసి తగులబెట్టిన దారుణం వెలుగు చూడటంతో.. జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్ శివారులో దిశపై జరిగిన అత్యాచారం యావత్ దేశ ప్రజల మనసులను చలింపజేసింది. 2019 నవంబర్ 27న శంషాబాద్ శివారులోని తొండుపల్లి టోల్గేట్ సమీపంలో దిశ ఘటన జరిగింది. వెటర్నరీ డాక్టర్ దిశ బైక్కు పంచర్ చేసిన దుర్మార్గులు.. మాయమాటలతో ఆమెను అక్కడి నుంచి లారీలో ఎత్తుకెళ్లారు. షాద్నగర్ వద్ద అత్యాచారానికి ఒడిగట్టి కిరాతకంగా సజీవ దహనం చేశారు.
ఔటర్ చుట్టూ ఉన్న సర్వీస్ రోడ్లపై అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నగర్ విస్తరించడంతో ఔటర్ కు పరిసరాల్లో గృహసముదాయాలు భారీగా పెరిగాయి. నగరంలో వివిధ పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు.. ఔటర్ పరిసరాల్లో నివాసముంటున్నారు. వారిలో మహిళలు కూడా ఎక్కువగా ఉద్యోగాలు, వివిధ పనుల కోసం బయటకు రాక తప్పడంలేదు. అయితే ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుంటున్న అగంతకులు.. దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
ఇక చుట్టుపక్కల ప్రాంతాల్లోని కాలేజీల్లో చదువుకుంటున్న అమ్మాయిలు, సంస్థల్లో పని చేస్తున్న మహిళలు.. ఒంటరిగా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఔటర్ చుట్టుపక్కల ప్రాంతాలు లక్ష్యంగా సాగుతున్న అక్రమ దందాలు, గంజాయి విక్రయాలు కూడా స్థానిక మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నాయి.
నేరగాళ్లకు చెక్ పెట్టాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందునే ఔటర్ పరిసరాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్న అరోపణలు వినిపిస్తున్నాయి. సర్వీసు రోడ్లపై పెట్రోలింగ్ నిర్వహణ లేకపోవడం, అక్రమ దందాలను అరికట్టకపోవడం నేరాలకు కారణమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. శంషాబాద్ ఘటనకు కూడా పోలీసుల నిర్లక్ష్యమే కారణమన్న విమర్షలు వ్యక్తమవుతున్నాయి.