Hyderabad Metro : నాలుగేళ్ల ప్రయాణం..హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చి నాలుగేళ్లు దాటింది. ఒకప్పుడు ట్రాఫిక్ జామ్ లతో తీవ్ర ఇబ్బందులు పడిన నగర వాసులకు మెట్రో ప్రయాణం ఎంతో సమయాన్ని ఆదా చేస్తోంది. అనుకున్న సమయానికి గమ్య స్థానానికి చేరుకుంటున్నారు. దీంతో మెట్రోకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఏడాదిలోనే రోజూ వారీ ప్రయాణికుల సంఖ్య 4 లక్షలు దాటింది. సరిగ్గా అదే సమయంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ తో కొన్ని నెలలు మెట్రో సర్వీసులు రద్దయ్యాయి. ఆ తర్వాత సర్వీసులను పునరుద్ధరించినా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం వల్ల మెట్రో ప్రయాణికుల సంఖ్య 2 లక్షలలోపే ఉండేది. అయితే గత ఆరు నెలల నుంచి ఐటీ ఉద్యోగులు క్రమంగా ఆఫీసుకు వస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గిపోవడంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య కరోనాకు ముందుస్థాయికి చేరుకుంది. రోజూవారీ ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటే అవకాశం కనిపిస్తోంది. మెట్రో స్టేషన్లలో వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి.
కరోనా ఎఫెక్ట్.. కరోనా ప్రభావం మెట్రోపై తీవ్రంగా పడింది. కొన్నాళ్లు నిర్వహణ ఖర్చులకు కూడా ఆదాయం రాకపోయినా సర్వీసులు నడిపారు. నాలుగేళ్ల నుంచి మెట్రో ఛార్జీలు పెంచలేదు. ఇప్పుడు మెట్రో ఆదాయం పెంచుకునేందుకు చర్యలు చేపట్టింది ఎల్ అండ్ టీ సంస్థ. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అభ్యర్థన మేరకు ప్రస్తుతమున్న ఛార్జీల సవరణకు కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సురేంద్రకుమార్ బగ్డె, రాష్ట్ర మున్సిపల్ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రిటైర్డ్ జస్టిస్ శ్యామ్ప్రసాద్ ఆధ్వర్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నగర వాసులు, మెట్రో ప్రయాణికులు తమ సలహాలు, సూచనలను ఈ– మెయిల్ ద్వారా పంపించాలని హెచ్ఎంఆర్ ప్రకటించింది. నవంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. తపాలా ద్వారా అయితే ఛైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైలు భవన్, బేగంపేట, 500003 చిరునామాకు పంపాల్సిందిగా కమిటీ మెట్రో ప్రయాణికులను సూచించింది.
3మార్గాలు.. నగరంలో మెట్రో ప్రాజెక్టు తొలిదశలో ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో 69.2 కి.మీ మేర అందుబాటులోకి వచ్చింది. ఈ మూడు రూట్లలో 57 రైళ్లను నడుపుతున్నారు. నిత్యం సుమారు 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. ప్రస్తుతం మెట్రో కనీస చార్జీ రూ.10. గరిష్టంగా రూ.60 ఉంది. అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు తమ బైక్ లు, కార్లను ఉచితంగా పార్కింగ్ చేసుకునే అవకాశం లేకపోవడం వల్ల తమ ఇళ్ల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. ఇది ప్రయాణికులకు అదనపు భారం.
ఛార్జీల పెంపు.. మెట్రో అధికారుల ముందస్తు అంచనాల మేరకు ఈ మూడు రూట్లలో 16 లక్షల మంది జర్నీ చేస్తారని అంచనా వేశారు. కానీ ఆ లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదు. చార్జీలు మరింత పెంచితే ప్రయాణికుల ఆదరణ తగ్గే అవకాశం ఉందని ప్రజారవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టోకు ధరల సూచీ, ద్రవ్యోల్బణం అంచనాలు, వినియోగ వ్యయాలు, మెట్రో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని చార్జీలను సవరిస్తారని సమాచారం. మెట్రోలో కనీస చార్జీ ప్రస్తుతం ఉన్న రూ.10 నుంచి రూ.20కి.. గరిష్ట చార్జీ రూ.60 నుంచి రూ.100కి పెంచుతారని తెలుస్తోంది.