Hyderabad: హైదరాబాద్ జనానికి మెట్రో రైల్ అధికారులు షాకిచ్చారు. ఇప్పటి వరకు ఇస్తున్న ప్రయాణ రాయితీల్లో కోత విధించారు. ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్పై ఇప్పటి వరకు ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం డిస్కౌంట్ ఉండేది. ఇకపై రద్దీ సమయాలలో ఈ డిస్కౌంట్ను పూర్తిగా ఎత్తివేయనున్నారు. తాజా నిర్ణయం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు .. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే మెట్రో ప్రయాణాలలో రాయితీ వర్తిస్తుందని మెట్రో అధికారులు తెలిపారు.
అదేవిధంగా సూపర్ సేవర్ హాలీడే కార్డ్ ఛార్జీని భారీగా పెంచనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. సెలవు రోజుల్లో ప్రయాణించే హాలిడే కార్డు 59గా ఉన్న ధరను 99కి పెంచనున్నారు. గతంలో 59లతో కార్డు తీసుకున్న వారు… సూపర్ సేవర్ 99 రూపాయలు రీఛార్జ్ చేసుకోవచ్చని మెట్రో అధికారులు వెల్లడించారు. కానీ కొత్తగా తీసుకునే వారు మాత్రం వంద రూపాయలు చెల్లించాల్సిందేని స్పష్టం చేశారు. అలాగే కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డుల ధరను భారీగా పెంచనున్నారు. డిస్కౌంట్ల ఎత్తివేతతో హైదరాబాదీలకు మెట్రో ప్రయాణం మరింత భారం కానుంది.