అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణంరెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1,265 కేజీల భారీ లడ్డును తయారు చేయించారు. దీన్ని వీరు అయోధ్యకు పంపించనున్నారు. ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరిగిన మొదలు రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా నాగభూషణం దంపతులు అదే సంఖ్య బరువు గల లడ్డూ తయారు చేయించారు.
లడ్డూ అయోధ్యకు చేర్చేందుకు శోభాయాత్రను ప్రారంభించారు. పికెట్ లోని తన నివాసం నుంచి శోభాయాత్ర మొదలైంది. ఈ నెల 21 నాటికి అయోధ్యకు చేరుకుంటాయని నాగభూషణంరెడ్డి తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి ముందుగా అనుమతి పొంది, స్వామి వారికి నైవేధ్యంగా సమర్పించేందుకు ఈ భారీ లడ్డూను సిద్ధం చేసినట్లు చెప్పారు.
ఈ లడ్డూ తయారీకి 350 కిలోల శనగపిండి, 700 కిలోల చక్కెర, 40 కిలోల నెయ్యి, 40 కిలోల కాజు, 30 కిలోల కిస్మిస్, 15 కిలోల బాదం, 10 కిలోల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పువ్వు వినియోగించారు. ఈ లడ్డూను రాముడి గుడికి 50 మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారు. ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా పంచుతారు.