మహిళ అర్ధరాత్రి నడిరోడ్డుపై స్వేచ్ఛగా నడిచినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. మహిళలకు ఎప్పుడు ఏ కష్టమొచ్చినా క్షణాల్లో ఆదుకుంటామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. విషాదమేంటంటే…. గాంధీజీ ఆశయం నేటికీ నెరవేరలేదు. తెలంగాణ పోలీసులు చెప్పిన మాటలు ఆచరణలో కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనం… మీర్పేట్కు చెందిన ఓ మహిళపై హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీసుల పాశవిక చర్య. స్వాతంత్య్ర దినోత్సవం రోజు జరిగిన ఈ దాడిలో పోలీసులు… రక్షక భటులా… రాక్షసులా అన్నట్టుగా వ్యవహరించారు.
అది ఆగస్టు 15. స్వాతంత్య్ర దినోత్సవం. రాత్రి 11 గంటలు. లక్ష్మి మహిళ.. సరూర్నగర్ రోడ్డులోని బంధువుల ఇంటికి వెళ్లి… తిరిగి మీర్పేట్ లోని సొంతింటికి వెళ్తున్నారు. ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకోగానే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్లొస్తున్నావంటూ నిలదీశారు. కూతురు పెళ్లికి డబ్బుల కోసం బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్నానని లక్ష్మి చెప్పారు. లగ్నపత్రిక కూడా చూపించారు. కానీ… పోలీసులు ఆమెను వదలలేదు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
రాత్రి విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది… ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. రాత్రంతా స్టేషన్లోనే ఉంచారు. విచక్షణ రహితంగా కొట్టారు. ఉదయం వదిలేశారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.