Heavy Rain in Hyderabad: హైదరాబాద్ నగరంలో మంగళవారం తెల్లవారుజామున వర్షం దంచి కొట్టింది. ఈ వర్షానికి వరద నీటితో రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి.ఈ వర్షాలకు హైదరాబాద్ వాసులు వణికిపోతున్నారు. ప్రస్తుతం వర్షం తగ్గినప్పటికీ ఉరుములు, మెరుపులతో భయపడుతున్నారు. మరో రెండు రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అత్యవసరమయితే తప్పా ఎవరూ బయటకు రావొద్దని నగరవాసులకు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మంగళవారం కూడా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని పలువురు రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు పంపుతున్నారు. వర్షంతో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఈ విషయంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Also Read: వైద్యశాఖ మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు.. హైదరాబాద్లో కూడా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయా..?
అంతకుముందు సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాత్రి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. గంటలతరబడి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్, ఫిల్మ్ నగర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, టోలిచౌకి, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, బీఎన్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో సుమారు 3 గంటల పైగా నరకయాతన పడ్డారు. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.