Commissioner Amrapali latest news(Hyderabad news today): తెలంగాణలో అధికార యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి. గత పాలన మరకలు తుడిచేస్తూ తనదైన మార్క్ పాలన చూపేందుకు కీలక అధికారులను నియమిస్తున్నారు. అందులో భాగంగానే ఐఏఎస్ బదిలీలపై కసరత్తు చేసి ఒకే సారి 44 మంది అధికారులను బదిలీ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి, అక్రమాల ఆరోపణలతో ప్రజాగ్రహానికి గురైన జీహెచ్ఎంసీని సమూలంగా ప్రక్షాళన గావించాలని అనుకున్నారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ కమిషనర్ గా సిన్సియర్ అధికారిణి అమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా జీహెచ్ఎంసీని బలోపేతం చేసే దిశలో భాగంగానే అమ్రమాలిని నియమించినట్లు సమాచారం.
దటీజ్ అమ్రపాలి..
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అమ్రపాలి జీహెచ్ఎంసీ కమిషనర్ గా తనదైన మార్క్ పాలన అందిస్తున్నారు. నెల రోజుల క్రితం అమ్రపాలి సడన్ గా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలను విజిట్ చేశారు. ముందుగా తాను వస్తున్నట్లు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కూకట్ పల్లి పరిధిలోని రైతుబజార్లను సందర్శించారు. అక్కడ అపరిశుభ్రమైన చెత్తా చెదారంపై సీరియస్ అయ్యారు. మున్సిపల్ అధికారులను పిలిపించి శానిటేషన్ పనులపై శ్రద్ధ వహించాలని ఆగ్రహించారు. అసలే వర్షాకాలం..ఈ వర్షాలకు తోడు దోమలు..ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్తతో స్థానికులు అవస్థలు పడుతుంటే మీరు పట్టించుకోరా అని అధికారులను మందలించారు. అలాగే ఈ మధ్య మార్నింగ్ వాక్ చేసుకుంటూ చెరువుల కబ్జారాయుళ్లపై సీరియస్ అయ్యారు.
పూడిక పనులపై దృష్టి
అక్రమంగా ఆక్రమణకు గురయిన చెరువుల లిస్ట్ తయారుచేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే చెరువులలో పూడిక పనులు నత్తనడకన సాగడంపై సీరియస్ అయ్యారు. ఇకపై చెరువుల సుందరీకరణపై దృష్టి పెడతామని చెప్పారు.చెరువులలో చెత్తా చెదారం వేయకుండా చెరువుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. ఇళ్లనుంచి వచ్చే మురుగునీరు కూడా చెరువులలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చెరువుల చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండే అపార్టుమెంట్లు, విల్లాలనుండి వ్యర్థాలు, మురుగునీరు చెరువులలో కలవకుండా సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా భవన యజమానులను అప్రమత్తం చేశారు.
భవన నిర్మాణ యజమానులకు హెచ్చరిక
సిటీ పరిధిలో ఎక్కడెక్కడ వరద నీరు వచ్చి చేరుతుందో ఆ ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించాలని..యుద్ధ ప్రాతిపదికన అక్కడ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. భవన నిర్మాణ యజమానులకు డ్రైనేజీ సౌకర్యం విధిగా ఉండి తీరాలని..రోడ్డు మీదకు మురుగునీరు వదిలితే కఠినచర్యలు ఉంటాయని అమ్రపాలి హచ్చరించారు. టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా అనుమతుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించారు.