Hyderabad crime : భార్య భర్తల మధ్య గొడవలు జరగడం సర్వ సాధారణం. కొందరు గొడవ పడిన మరుక్షణం కలిసిపోతారు. మరికొందరు చిన్న విషయాన్ని పెద్దాదిగా చేసి.. విడిపోతుంటారు. మనస్తాపానికి గురై ఆత్మహత్యల వరకు వెళ్తారు. తాజాగా ఉప్పల్ లో ఇదే ఘటన జరిగింది.
ఒక భర్త తన భార్యకు వీడియో కాల్ చేసి లైవ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా పెద్ద కందుకూరుకు చెందిన ముత్తడి నరేష్ (28) అనే వ్యక్తి మెట్రో రైలు సిగ్నలింగ్ లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఏడాది క్రితం నిత్యశ్రీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు ఉప్పల్ లోని సరస్వతి కాలనీలో నివాసం ఉంటున్నారు.
నిత్యశ్రీ సీమంతం కోసం పుట్టింటికి వెళ్లింది. సీమంతానికి బంధువులను పిలిచే క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చిన్న గొడవ కాస్త పెరిగి ఆస్తి తగాదాల వరకు వెళ్ళింది. నరేష్ మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం (డిసెంబర్ 29) తన భార్యకు వీడియో కాల్ చేసి తను చూస్తుండగానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నరేష్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.