Kidnap: సులువుగా డబ్బు సంపాదించడమే వారి ప్లాన్. అందుకోసం షేర్ మార్కెట్, ఆన్లైల్ ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టడం అలవాటు. అందులో భారీ నష్టాలను చవిచూడడంతో ఈజీ మనీ కోసం దారులు వెతికారు. అతి తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కారు. బాలుడి కిడ్నాప్కు తెగించారు. పోలీసుల ఎంట్రీతో స్కెచ్ బెడిసికొట్టింది. చేతులకు సంకెళ్లు పడ్డాయి. మల్కాజ్గిరి బాలుడి కిడ్నాప్ కేసు వెనుక అసలేం జరిగిందంటే…
రాచకొండ పోలీస్ కమిషనరేట్లో కిడ్నాప్కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది. మల్కాజ్గిరి పీఎస్ పరిధిలో నివాసం ఉండే శ్రీనివాస్కు 13 ఏళ్ల కొడుకు హర్షవర్ధన్ ఉన్నాడు. ఈ నెల 15న బాలుడు అదృశ్యం అయ్యాడు. కాలనీలో ఆడుకోడానికి వెళ్లిన పిల్లాడు ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో పేరెంట్స్.. తెలిసిన చోట్లలో వెతికారు. ఎక్కడా కనపించకపోయేసరికి.. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న వెంటనే పోలీసులు.. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. 8 బృందాలుగా ఏర్పడిన పోలీసులు కిడ్నాపైన బాలుడి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఇంతకూ.. బాలున్ని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు.. వాళ్ల ఇంటిపక్కన ఉండే వాళ్లే. ఇంటిపక్కన ఉండే ఇంట్లో నివసించే రవి, శివ అనే ఇద్దరు యువకులు అన్లైన్ ట్రేడింగ్లో భారీగా డబ్బులు పెట్టి నష్టపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక ఈ కిడ్నాప్ ప్లాన్ చేశారు. సులువుగా డబ్బు సంపాదించే పథకంలో భాగంగా కిడ్నాప్ పథకం రచించారు. వీరి నివాసానికి సమీపంలోనే శ్రీనివాస్ కుమారుడు టార్గెట్గా కిడ్నాప్ ప్లాన్ను అమలు చేశారు. పైగా బాబు తండ్రి ఓ కన్స్ట్రక్షన్ వ్యాపారి కావటంతో డబ్బులు కూడా అడిగినంతా ఇస్తాడని నెల రోజులుగా కిడ్నాప్ ప్లాన్ చేశారు. కిడ్నాప్ ప్రక్రియ సజావుగా సాగేందుకు మహబూబాబాద్కు చెందిన మహిపాల్, దిలీప్ సహాయం తీసుకున్నారు. వారికి కిడ్నాప్ ప్లాన్ వివరించి 20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరితో పాటు బాలుడితో సన్నిహితంగా ఉండే ఓ మైనర్కు కూడా డబ్బు ఆశ చూపి ప్లాన్లో భాగస్వామిని చేశారు. ఇంకేముంది తాము ముందుగా రచించిన పథకం ప్రకారం కిడ్నాప్ స్కెచ్ను అమలు చేశారు. ప్లాన్లో భాగంగానే.. ఆడుకునేందుకు వచ్చిన బాలుడిని మరో బాలుడు క్రికెట్ బాల్ కొనిస్తానని చెప్పి ట్రాప్ చేశాడు. నమ్మి ఆ బాలుడితో వెళ్లగా వీళ్లిద్దరు కారులో బాలున్ని కిడ్నాప్ చేశారు. అయితే.. కిడ్నాపర్లతో తార్నాక వరకు వచ్చిన మైనర్ బాలుడు.. తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లిపోయాడు.
తార్నాక వరకు వెళ్లగానే నిందితుల్లో ఒక్కొక్కరు కారు నుంచి దిగిపోయారు. అనంతరం కారులో చక్కర్లు కొడుతూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట వెళ్లారు. ఇక బాలుడి తండ్రికి ఫోన్లు చేయడం ప్రారంభించారు నిందితులు. తమ ఫోన్లను పోలీసులు ట్రేస్ చేసే వీలు లేకుండా వివిధ రకాల యాప్స్ ద్వారా ఉపయోగించారు. ఇంటర్నేషనల్ కాలింగ్ చూపించేలా ప్లాన్ చేసుకున్నారు. ఇంకేముంది డబ్బులు డిమాండ్ చేస్తూ బాలుడి తండ్రికి ఫోన్లు చేయడం కొనసాగించారు. బాలుడు ప్రాణాలతో కావాలంటే రెండు కోట్ల రూపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని చూస్తే బాలుడిని చంపేస్తామని బెదిరించారు.
నిందితుల కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉన్నారు. నిందితులు జనగామ జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో పాలకుర్తి వద్ద కారు సంచరిస్తున్నట్లు స్థానిక పోలీసులకు రాచకొండ పోలీసులు సమాచారం అందించారు. ఇక డబ్బులు సమకూరేలా లేవని తెలుసుకున్న నిందితులు ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాబును చంపేయడానికి డిసైడ్ అయ్యారు. అంతలోపే పోలీసులు అక్కడికి చేరుకుని బాబుని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించి కిడ్నాప్ కేసును ఛేదించారు. కిడ్నాపైన 36 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
బాలున్ని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు.. వాళ్ల ఇంటిపక్కన ఉండే వాళ్లని తెలియడంతో బాలుడు హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. తమతో సన్నిహితంగా ఉంటూనే ఇలా చేస్తారని అనుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.