Hyderabad : హైదరాబాద్ నార్సింగీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అల్కాపూరీ కాలనీ మదర్సాలో చిన్నారుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ బాలుడు మరణించడం సంచలనంగా మారింది. మదర్సాలో బీహార్ కు చెందిన 12 మంది విద్యార్ధులు ఉంటున్నారు. అయితే గురువారం రాత్రి వారి మధ్య వివాదం జరిగింది.
మహ్మద్ రకీమ్ అనే బాలుడిపై మిగతా పిల్లలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రకీమ్ అక్కడే కుప్పకూలాడు. బాధితుడిని హుటాహుటిన గోల్కొండ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.