Crude prices of essential commodities: దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే మంచి నూనెతోపాటు ఉల్లి ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి. తాజాగా, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, కందిపప్పు ఇలా నిత్యావసర సరుకులు సైతం పెరగడంతో సామాన్యుడికి రోజు గడవడం చాలా కష్టంగా మారింది.
ఒకవైపు కూరగాయల ధరలు, మరోవైపు నిత్యావసర సరుకులు పెరగడంతో మార్కెట్ వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. కూరగాయల ధరలు భగ్గుమంటుండగా.. ఆకాశన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు దిగిరానంటున్నాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తుండగా.. పెరిగిన ధరలు అదనపు భారం కావడంతో పస్తులుండాల్సి వస్తోంది.
నూనెలు, పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటడంతో సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల టమోట ధరలు మోత మోగగా.. ప్రస్తుతం ఉల్లిగడ్డలు వంతు వచ్చింది. కొనకుండా.. కోయకుండానే కళ్లల్లో ఉల్లి నీళ్లు తెప్పిస్తుంది. ఇక, నిత్యావసర ధరలు కూడా ప్రస్తుతం ఆకాశన్నంటాయి.
ప్రస్తుతం మార్కెట్లో నూనె ధరలు లీటర్పై రూ.20 నుంచి 45 వరకు పెరిగాయి. ఇక, అల్లం కిలో రూ.100 నుంచి రూ.150, వెల్లుల్లి రూ. 300 నుంచి 360, ఎండు మిర్చి రూ.200 నుంచి రూ.240, కందిపప్పు కిలో రూ.150 నుంచి రూ,175, పెసరపప్పు రూ. 30 పెరిగింది. దీంతో రూ. 150 వరకు ఉంది. ఇక మినపపప్పు రూ.135కి చేరగా.. ఉల్లి ధరలు కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలుకుతున్నాయి.
Also Read: కాసేపట్లో హైదరాబాద్కు రాష్ట్రపతి.. ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లో వెళ్లొద్దు!