Sankranti: సేమ్ సీన్. ప్రతీ ఏటా జరిగేదే. ఎప్పటిలానే ఈసారి కూడా సంక్రాంతికి పల్లె బాట పట్టింది పట్నం. బండెనక బండి నడుపుతూ.. లక్షలాదిగా వాహనాలు బారులు తీరాయి. అంతా పండగ కోసమే. సొంతూళ్లకు పయనమైనవాళ్లే. అట్లుంటది మరి సంక్రాంతి అంటే.
శని, ఆది, సోమ.. వరుసగా మూడు రోజులు సెలవులు. అందులోనూ సంక్రాంతి పండుగ. హైదరాబాద్ లో ఉంటే తప్పు అన్నట్టుగా.. అంతా స్వగ్రామం బాట పట్టారు. హైదరాబాద్ నుంచి ఏపీకి అత్యధికంగా తరలి వెళ్లారు. తెలంగాణవాసులు సైతం గోదావరి జిల్లాల బాట పట్టారు.
ఇప్పుడంతా కంఫర్ట్ లైఫ్ స్టైల్. చాలామందికి సొంత కార్లు ఉన్నాయి. బస్సులు, రైళ్లలో వెళ్లేవారు ఎంతమంది ఉన్నా.. అంతకుమించి అన్నట్టుగా కార్లలో వెళ్లేవారు పెరిగారు. టోల్ గేట్ దాటిన వాహనాల సంఖ్యే ఆ విషయాన్ని చెబుతోంది.
సంక్రాంతి సందర్భంగా గురు, శుక్రవారాల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు 1.24 లక్షల వాహనాలు వెళ్లినట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. జనవరి 12న 56,500 వాహనాలు వెళ్లగా.. జనవరి 13న 67,500 కార్లు వెళ్లినట్లు వివరించారు. ఈ లెక్క.. పంతంగి టోల్ గేట్ మీదుగా వెళ్లిన వాహనాల సంఖ్య మాత్రమే. రెండు రోజుల్లో మొత్తం 98 వేలకు పైగా కార్లు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లినట్టు తేల్చారు.
ఇక, హైదరాబాద్ నుంచి వరంగల్ వైపునకు బీబీనగర్ టోల్ గేట్ మీదుగా శుక్రవారం 26 వేల వాహనాలు వెళ్లగా.. అందులో 18వేల కార్లు ఉన్నాయి. పండుగల కోసం వెళ్తున్న వారిలో 90 శాతం మంది వ్యక్తిగత వాహనాల్లోనే వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు. ఎల్బీనగర్, ఉప్పల్ కూడళ్ల దగ్గర ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇప్పుడు ఎన్నైతే కార్లు పల్లె బాట పట్టాయో.. పండగ ముగిశాక మళ్లీ అవన్నీ హైదరాబాద్ తిరిగిరావడం ఖాయం. మళ్లీ ఓ రెండు రోజుల పాటు టోల్ గేట్ల దగ్గర.. బండెనక బండితో.. వాహనాల జాతరే.