Bhadrachalam : భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకంలో ఒకటైన పథకం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం నేపథ్యంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది.
వైకుంఠ ఏకాదశి ముగిసినప్పటికీ నేడు, రేపు సెలవులు రావడంతో మహిళలు ఉచిత ప్రయాణం బస్సుల్లో భద్రాచలం రామయ్య దర్శనానికి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఇదిలా ఉండగా ప్రతి వారం సెలవు దినాల కంటే ఈ వారం సెలవు దినాలకు భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా నిత్య కల్యాణాలు ఆపివేయడం జరిగింది. ఈ రోజు నుంచి నిత్య కళ్యాణం పునః ప్రారంభించడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు కల్యాణం చేయించుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా ప్రసాదాలు రెగ్యులర్ కౌంటర్ మాత్రమే కాకుండా స్పెషల్ కౌంటర్లు పెట్టి ప్రసాదం లడ్డూలు విక్రయిస్తున్నారు. ప్రతి వారం సెలవు దినాల కంటే ఈ వారం సెలవు దినాలలో జనాల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడూ చేయించే 20 వేల లడ్డూల కంటే ఈ రోజు 40 వేల లడ్డూలుకు పైగా తయారు చేయిస్తున్నట్లు ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు.