BRS MLAs : తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మొదలు పెడితే, హైదరాబాద్ లోని ఫ్లై ఓవర్ల వరకు భారీగా దండుకున్నారనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. అయితే అంతా కేసీఆర్ కుటుంబం వరకే లబ్ధి కలిగిందని అనుకున్నారు. కానీ వారితో పాటు ఎమ్మెల్యేల ఆస్తులు కూడా భారీగా పెరిగాయనే సంగతి తెలిసిన జనాలు అవాక్కయ్యారు.
ఒకరిద్దరు కాదు, ఏకంగా 24 మంది ఎమ్మెల్యేల ఆస్తులు బాగా పెరిగాయి. ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. వీరంతా ఇప్పుడు ఎన్నికైన వారు కావడమే అందులో విశేషం. ఇక ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు ఎంత పెరిగాయో ఎవరికీ తెలీదని అంటున్నారు. ఇసుక దగ్గర నుంచి మొదలుపెడితే దేనినీ వదల్లేదని చెబుతున్నారు. తెలంగాణలో విలువైన ఖనిజ సంపద ఉంది. అది కూడా దోచుకున్నోళ్లకి దోచుకున్నంత చందంగా మారిందనే విమర్శలున్నాయి. ప్రజలకు చౌకగా ఇవ్వాల్సిన ప్రకృతి సంపదను అడ్డగోలుగా కొల్టగొట్టారని అంటున్నారు.
పెరిగిన ఆస్తుల వివరాలను కొందరు తక్కువో, ఎక్కువో నిజాయితీగా బయటకు చెప్పారు. అసలు చెప్పని వారి సంగతేటనేది అంతు చిక్కకుండా ఉందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. పెరిగితే ఏదో పదిశాతమో, లేక ఇరవై శాతమో పెరిగాయని అనుకుంటున్నారా? కాదండీ బాబూ…
గత ఐదేళ్లలో 24 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తులు 72.55 శాతం పెరిగాయి. అంటే దాదాపు డబుల్ అయ్యాయన్నమాట. ఇవి అధికారిక లెక్కల వరకు మాత్రమే. అనధికారికంగా ఎంత ఉందనేది తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తులు 63.6 శాతం పెరిగాయి. నలుగురు ఎంఐఎం ఎమ్మెల్యేల ఆస్తులు 59.23 శాతం పెరిగాయి. ఒక్క బీజేపీ ఎమ్మెల్యే ఆస్తులు 23.03 శాతం పెరిగాయి. మొత్తం 32 మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున 71 శాతం పెరిగినట్టు అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ నివేదిక వెల్లడించింది.
ఇంత అవినీతి జరుగుతున్నా, అందరు ఎమ్మెల్యేలపై అన్ని వర్గాలు గొంతెత్తి అరిచినా కేసీఆర్ పట్టించుకోలేదు. ఒక్క అవినీతి అనే కాదు, మహిళలను అగౌరవపరచడం, వారితో అసాంఘిక చర్యలకు పాల్పడటం, బహిరంగంగా సెటిల్మెంట్లు చేయడం, ఇలా ఒకటి కాదు ఎవరెన్ని చేసినా కేసీఆర్ కిమ్మనకుండా ఊరుకోవడం, తిరిగి సీట్లు ఇవ్వడం వల్లనే పరిస్థితి చేజారిపోయిందని అంటున్నారు.