TSRTC: సంక్రాంతి పండుగ రావడంతో పెద్ద ఎత్తున పట్టణవాసులు సొంతూళ్ల బాట పట్టారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపారు. ఈ సంక్రాంతి వేళ ఆర్టీసీకి రికార్డ్ స్థాయిలో ఆదాయం సమకూరింది. ఈ నెల 11 నుంచి 20 వ తేదీ వరకు రూ. 165. 46 కోట్ల ఆదాయం వచ్చింది. పోయిన ఏడాదితో పోలిస్తే ఈసారి రూ. 62.29 కోట్లు అదనంగా వచ్చాయి.
11 రోజుల్లో మొత్తం 2.82 కోట్ల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించారు. మొత్తం 3.57 కి.మీ మేర ఆర్టీసీ బస్సులు తిరిగాయి. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడంతో ప్రయాణికులు బస్సులో ప్రయాణించేందుకు ఆసక్తి చూపారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. టోల్ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు, ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి తిరుగు ప్రయాణంలో 10 శాతం డిస్కౌంట్ వంటి ఆఫర్లను తీసుకొచ్చామని వెల్లడించారు. ఈసారి బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా 71.19 శాతానికి పెంచామని తెలిపారు.