Jurala Project 17 Gates Opened: గత కొద్ది రోజుల నుంచి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది పొంగి పొర్లుతున్నది. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఆదివారం ఇన్ఫ్లో 92 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ఫ్లో 1.71 లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు 17 గేట్లను ఎత్తి దిగువనకు నీళ్లను వదులుతున్నారు. అయితే, జూరాల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు.. ప్రస్తుత నీటి మట్టం 317.17 మీటర్లకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసి 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఎగువన వర్షాలు పడుతుండడంతో కృష్ణమ్మ ఉధృతి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాలైన నాగర్ దొడ్డి, గార్లపాడు, వామన్ పల్లి ప్రాంతాల్లో తీరం వద్దకు వెళ్లొద్దని సూచించారు. నారాయణపేట జిల్లాలోని కృష్ణా, మక్తల్ మండలాల పరిధిలోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు ఉండడంతో వరద ప్రవాహం పెరిగే ఛాన్స్ ఉంది. జూరాల గేట్లు ఎత్తడంతో వరద శ్రీశైలం ప్రాజెక్టు వైపు పరుగులు పెడుతోంది.
Also Read: తడిసి ముద్దైన తెలంగాణ.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఇదిలా ఉంటే.. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల జలాశయం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల నుంచి 96,141 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చే చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 821.20 అడుగులు కాగా, నీటి నిల్వ 41.6978 టీఎంసీలుగా నమోదయ్యింది.