Godavari river news(Latest breaking news in telugu) : భారీ వర్షాలతో భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రామాలయం పరిసరాల్లోకి వర్షపు నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచనాలు జారీ చేశారు. అటు, కాళేశ్వరం త్రివేణీ సంగమం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం వద్ద 10 మీటర్ల మేర నీటిమట్టం ఉండగా.. అది అంతకంతకూ పెరుగుతోంది.
ఎగువ కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి నీటిమట్టం 9.3 అడుగులకు చేరింది. గేట్లు ఎత్తి బ్యారేజీ నుంచి 4.16 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సాయంత్రం వరకు మరో 6 లక్షల క్యూసెక్కుల వరద పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరదల నేపథ్యంలో ధవళేశ్వరంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు భద్రాచలం నుంచి.. ఇటు శబరి నది నుండి వచ్చే వరద నీటితో గోదావరి ఉప్పొంగుతోంది. వరద ఉధృతి పెరగడంతో పోలవరం ప్రాజెక్టు 48 గేట్లు పూర్తిగా ఎత్తి దిగువకు విడుదల చేశారు.
అప్ స్ట్రీమ్ స్పిల్ వే వద్ద 30 వేల 680 మీటర్లకు చేరగా.. డౌన్ స్ట్రీమ్ స్పిల్ వే 21 వేల 720 మీటర్లకు చేరుకుంది గోదావరి నీటిమట్టం. వరద ఉధృతి పెరగడంతో 48 గేట్లు ద్వారా దిగువకు 3 లక్షల 15 వేల 791 క్యూసెక్కులు వదులుతున్నారు. కాళేశ్వరం, పేరూరు, శబరి, ఇంద్రావతి నదులు గోదావరి నదిలో కలవడంతో భారీగా వరద వచ్చి చేరుతోంది.
కోనసీమకు వరద ఉధృతి పెరగడంతో నదీపాయ గట్టు తెగిపోయింది. నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడవలపైనే ప్రయాణాలు కొనసాగిస్తున్నారు ప్రజలు.
అల్లూరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు.. చింతూరు మండలం సోకిలేరు, చీకటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కుయుగురు కాజ్ వే పైకి చేరిన వరద నీరు ప్రవహిస్తుండటంతో.. చింతూరు మండలంలోని సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కూనవరం మండలం శబరి బ్రిడ్జి వద్ద శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
కొండరాజు పేట గ్రామం కాజ్ వే పైకి శబరి వరద నీరు చేరడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వి.ఆర్.పురం మండలం అన్నవరం వాగు ఉధృతికి బ్రిడ్జి కొట్టుకుపోవడంతో సుమారుగా 40 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. నాలుగు మండలాల్లో సుమారుగా 100 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.