Budget :ఈ ఏడాది చివరిలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. రైతులను ఆకర్షించేందుకు భారీ కేటాయింపులు ఉంటాయనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్ లో సాగు రంగానికి భారీగా కేటాయింపులు చేశారు. రైతులను ఆకట్టుకునేందుకు భారీగా నిధులు ప్రతిపాదించారు. వ్యవసాయశాఖకు 26,831 కోట్లు కేటాయించారు. నీటి పారుదల రంగానికి రూ. 26,,885 కోట్లు కేటాయించారు. రుణమాఫీ పథకానికి 6,385 కోట్లు , రైతు బంధుకు 1,575 కోట్లు, రైతు బీమా పథకానికి 1,589 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించారు.
వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. రాష్ట్రంలో రూ.3,825 కోట్లతో 1200 చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. మొదటి దశ 650 చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 60 శాతం పూర్తయిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టంగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొత్తంగా 73 లక్షల 33 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు హరీశ్ రావు. రెండు మూడేళ్లలో మరో 50 లక్షల 24 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం నీటిపారుదల రంగానికి బడ్జెట్ రూ.26,885 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు.
పామాయిల్ సాగు ద్వారా రైతులకు ఎకరానికి రూ. లక్షా 50వేల ఆదాయం వస్తోందని హరీశ్ రావు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పెంచాలన్నదే లక్ష్యమన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు.
వ్యవసాయరంగంలో తెలంగాణ నేడు దేశానికి దిశా నిర్దేశం చేస్తోందని హరీశ్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు పదేళ్లు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం రూ.7,994 కోట్ల నిధులు ఖర్చు చేశాయని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు నుంచి 2023 జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం 1 లక్షా 91 వేల 612 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసిందన్నారు.
మొత్తంమీద రైతులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయింపులు చేసింది. మరి ఆ నిధులను ప్రతిపాదనలకు అనుగుణంగా ఖర్చు చేస్తుందా అనేదే ప్రశ్న. అలాగే అన్నదాత కోసం కొత్త పథకాలను ప్రకటించలేదు. గతంలో ఉన్న పథకాలే కొనసాగిస్తోంది. మరి ఈ బడ్జెట్ రైతులను సంతృప్తి పరుస్తుందా?