హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ( Hydra ) కమిషనర్ ఏవీ రంగనాథ్ పై కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (human rights commission)లో కేసు నమోదైంది. హైడ్రాకు చెందిన అధికారులు తమ ఇల్లు సైతం కూల్చేస్తామని భయభ్రాంతులకు గురి చెయ్యడంతోనే వృద్ధురాలు బుచ్చమ్మ బలవన్మరణానికి పాల్పడినట్లు పెద్ద ఎత్తున సమాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు.
మానవ హక్కుల సంఘం పిలుపు…
ఈ నేపథ్యంలోనే 16063/IN/2024 కింద కమీషనర్ ఏవీ రంగనాథ్ పై కేసు నమోదు అయ్యింది. త్వరలోనే ఈ కేసును విచారించనున్నట్లు మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. ఇప్పటికే బుచ్చమ్మ ఆత్మహత్యపై రంగనాథ్ సైతం స్పందించారు.
అందువల్లే బుచ్చమ్మ ఆత్మహత్య…
‘హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని శనివారం ఆయన మీడియా ముఖంగా వివరించారు. బుచ్చమ్మ తన కూతుళ్లకు ఇచ్చిన 3 ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయన్నారు. అయితే కూల్చివేతల్లో భాగంగానే తమ ఇళ్లను కూడా ఎక్కడ కూలుస్తారనే భయంతోనే వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. కూతుర్ల మాటలకు నొచ్చుకున్న బుచ్చమ్మ ఆత్మహత్యకు ఒడిగట్టింది.
Also Read : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఆ స్థానం వారిదే అంటూ ప్రకటన
హైడ్రాకు సంబంధం లేదు…
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఈ ఇష్యూకు హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. హైడ్రా గురించి వార్తల్లో గానీ, ఇతర సామాజిక మాధ్యమాల్లోగానీ భయాలు పుట్టించొద్దని ఆయన కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎలాంటి కూల్చివేతలనైనా హైడ్రాకు ఆపాదిస్తున్నారన్నారు. హైడ్రా అంటే ఒక భరోసా అని, కూల్చివేతల గురించి అనవసర భయాలు అవసరం లేదని రంగనాథ్ ధైర్యం చెప్పారు.