తెలంగాణలోని కొత్తగూడెం నియోజకవర్గానికి ఎంతో ప్రత్యేకత ఉన్నా అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలోనే ఉంది. సీఎం కేసీఆర్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శలు వ్యక్తవుతున్నాయి. ఎన్నోఏళ్లుగా ప్రజల రవాణా కష్టాలు తీరడం లేదు. పెనబల్లి బ్రిడ్జి పనులు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి.సీతారామ సాగర్ సాగునీటి ప్రాజెక్టుది అదే పరిస్థితి . పర్యాటక ప్రాంతం కిన్నెరసాని అభివృద్ధికి నోచుకోవడంలేదు. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రుణమాఫీ లాంటి సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడంలేదనేది స్థానిక ప్రజల మాట.
అటు రాజకీయంగానూ కొత్తగూడెం హాట్ టాపిక్ గా ఉంది. ఈ ప్రాంత ప్రజలు విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటారు. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాకిచ్చారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరు పార్టీల అభ్యర్థులను గెలిపించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. 2009 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయభేరి మోగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావును ప్రజలు గెలిపించారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. కానీ ఆ తర్వాత వనమా కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి కారెక్కారు.ఇప్పుడు జలగం వెంకట్రావు, వనమా వెంకటేశ్వరరావు ఇద్దరూ కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు.సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమాకే బీఆర్ఎస్ అధిష్టానం టిక్కెట్ ఇచ్చింది. ఆయన 1989,1999, 2004, 2018లో ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి గెలిచారు. అయితే ప్రస్తుతం వనమా ప్రభావం బాగా తగ్గింది. ఈ స్థానాన్ని 1985, 1994 ఎన్నికల్లో టీడీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీకి ఇప్పటికీ సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది.
కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ కు గట్టి పట్టుంది. ఈ బలంతోనే వనమా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి చురుగ్గా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ సెగ్మెంట్ పై అందరి దృష్టిపడింది.
కొత్తగూడెం నియోజకవర్గంలో సుజాత నగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్ లో ప్రస్తుతం 2 లక్షల 37 వేల 63 మంది ఓటర్లు ఉన్నారు. 2018 ఎన్నికల్లో 81.75 శాతం పోలింగ్ నమోదైంది.
ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపుల ప్రభావం ఎక్కువ. ఆ తర్వాత ముస్లింలు, ఎస్సీలు, పద్మశాలీల ఓట్ల కీలకం. మున్నూరు కాపులు 18 శాతం, ముస్లింలు 15 శాతం, ఎస్సీలు 11 శాతం, కాపులు 10 శాతం, పద్మశాలీలు 10 శాతం, వెలమలు 9 శాతం, ఎస్టీలు 8 శాతం, కమ్మలు 8 శాతం, రెడ్డిలు 5 శాతం ఉన్నారు.