Sayanna: ఆరుసార్లు ఎమ్మెల్యే. సీనియర్ మోస్ట్ నాయకుడు. అలాంటి సాయన్న చనిపోతే అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరపరా? ఇది తమ నేతకు తీరని అవమానం. దళిత ఎమ్మెల్యే కాబట్టే ఇలా చేస్తున్నారా? చావులోనూ ఇంత నిర్లక్ష్యమా? 30 ఏళ్లు ప్రజాసేవ చేసిన ఎమ్మెల్యేను ఇంతలా అవమానించాలా? ప్రభుత్వం ఏం చేస్తోంది? అధికారులు ఉండి ఏం లాభం? సినీ వర్గాలకు చేస్తారు కానీ మా ఎమ్మెల్యేను అధికార లాంఛనాలతో సాగనంపరా?.. ఇలా సాయన్న అనుచరులు పలువురు మంత్రులను, అధికారులను, పోలీసులను గట్టిగా నిలదీశారు. తమ అభిమాన నాయకుడి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని పట్టుబట్టడంతో మారేడుపల్లి శ్మశాన వాటికలో ఉద్రిక్తత ఏర్పడింది.
ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియల విషయంలో అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఉత్తర్వులు ఇవ్వాల్సిన సీఎస్.. ఆదివారం కావడంతో ఆర్డర్స్ ఇవ్వలేదు. సోమవారమూ ఎలాంటి ఆదేశాలు రాలేదు. పైనుంచి ఆర్డర్స్ లేనివే తామేమీ చేయలేమని రెవెన్యూ, పోలీస్ వర్గాలు చెప్పాయి. దీంతో, సాయన్న అభిమానులు మరింత మండిపడ్డారు. అక్కడికి వచ్చిన మంత్రులు తలసాని, మల్లారెడ్డిలను నిలదీశారు. వారు ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అధికారిక లాంఛనాల ఉత్తర్వులకు సమయం పడుతుందని, చీకటి పడుతున్నందున అంత్యక్రియలకు బాగా ఆలస్యం అవుతుందని అధికారులు సర్ది చెప్పారు. అంత్యక్రియలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. సాయన్న కుటుంబ సభ్యులు సైతం నచ్చజెప్పడంతో అభిమానులు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసు భద్రత నడుమ సాయన్న అంత్యక్రియలు సాదాసీదాగా నిర్వహించారు.