హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆమె ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని తీగుల్ గ్రామంలో పర్యటించేందుకు షర్మిల రెడీ అయ్యారు. దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని ఆ గ్రామస్తులు ఇటీవల ఆందోళన చేశారు. దీంతో షర్మిల వారికి మద్దతు పలికారు. అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. షర్మిల పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ఉదయమే లోటస్ పాండ్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఆమె ఇంటి నుంచి బయటకురాగానే అడ్డుకున్నారు.
తనను ఎందుకు అడ్డుకుంటారని పోలీసులను షర్మిల ప్రశ్నించారు. తాను ఎలాంటి సమస్య సృష్టించడంలేదని స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తోంది బీఆర్ఎస్ వాళ్లేనని ఆరోపించారు. ప్రజలకు కోసం ప్రాణాలైనా అర్పిస్తానన్నారు.
జీవనోపాధి కోసం తాను రాజకీయం చేయడంలేదన్నారు.
పోలీసుల తీరుపై మండిపడిన షర్మిల రోడ్డుపై దీక్షకు దిగారు. తనను గజ్వేల్ నియోజకవర్గం వెళ్లేందుకు అనుమతించే వరకు మంచినీళ్లు కూడా ముట్టనని తేల్చిచెప్పారు.