Malla Reddy: మల్లారెడ్డి. మల్లారెడ్డి. మల్లారెడ్డి. ఐటీ రైడ్స్ తో రెండు రోజులుగా మారుమోగిపోతోంది ఈ పేరు. మీడియాలో నాన్ స్టాప్ కవరేజ్. ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఆ కాలేజ్, ఈ కాలేజ్ ముందు రిపోర్టర్లను మోహరించి.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ తో ఊదరగొడుతున్నాయి న్యూస్ ఛానెల్స్. మంగళవారమంతా ఆ ఇళ్ల దగ్గర హడావుడి కొనసాగగా.. బుధవారం లొకేషన్ ఛేంజ్ అయింది. మల్లారెడ్డి హాస్పిటల్ ముందుకు చేరింది హైడ్రామా. మంత్రి కుమారుడికి గుండె నొప్పి రావడం.. ఆయన్ను పరామర్శించేందుకు మల్లారెడ్డి తరలిరావడం.. మరో కొడుకు, కోడలు, సమీప బంధువులు, స్థానిక నేతలంతా ఆ ఆసుపత్రికి చేరడంతో.. ఐటీ రైడ్స్ అటెన్షన్ కాస్తా.. సెంటిమెంట్ టర్న్ తీసుకుంది.
ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే మంత్రి మల్లారెడ్డి.. ప్రస్తుత పరిస్థితికి కన్నీళ్లు పెట్టుకున్నారు. కొడుకు మహేందర్ రెడ్డికి గుండె నొప్పి విషయం తెలిసి హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. ఆయనతో పాటు ఐటీ అధికారులూ వెన్నంటే ఉన్నారు. అయితే, మహేందర్ రెడ్డికి డాక్టర్లు అయిన తన చిన్న కొడుకు భద్రారెడ్డి, చిన్న కోడలు ప్రీతిరెడ్డితోనే వైద్యం చేయించాలని పట్టుబట్టారు మల్లారెడ్డి. ఆ సమయంలోనే ఆయన కన్నీటి పర్యంతం అయినట్టు చెబుతున్నారు.
మల్లారెడ్డి డిమాండ్ మేరకు భద్రారెడ్డిని, ప్రీతిరెడ్డిని హాస్పిటల్ కు తీసుకొచ్చారు ఐటీ అధికారులు. మహేందర్ రెడ్డిని పరిశీలించి.. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. అదే సమయంలో మరో బంధువు ప్రవీణ్ రెడ్డిని కూడా అక్కడికి రప్పించారు. ఇలా, ఐటీ సోదాలు జరుగుతున్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకచోటకు చేరడం ఆసక్తికర పరిణామంగా మారింది.
మరోవైపు, హస్పటల్లో చికిత్స పొందుతున్న మహేందర్ రెడ్డిని పరామర్శించేందుకు ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, ఎల్.రమణ, ఎమ్మెల్యే వివేకానందలు హాస్పిటల్కు వెళ్లారు. మల్లారెడ్డితో మాట్లాడారు. అనంతరం వారంతా కలిసి మంత్రితో పాటు ఒకే కారులో వెళ్లిపోవడం ఇంట్రెస్టింగ్ పాయింట్.