YS Avinash Reddy News(Breaking news in Andhra Pradesh) : తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్రెడ్డికి కాస్త ఊరట
బుధవారం వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర తీర్పు
తల్లి అనారోగ్యం కారణంగా బుధవారం వరకు అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు
బుధవారం తుదితీర్పు ఇస్తామన్న హైకోర్టు న్యాయమూర్తి
వాట్ నెక్ట్స్? బుధవారం ఏం జరగనుంది?
కేవలం తల్లి అనారోగ్యం వల్లే అరెస్ట్ వద్దందంటే..?
తుది తీర్పు అవినాష్కు అనుకూలంగా ఉంటుందా?
ముందస్తు బెయిల్ ఇస్తుందా? నిరాకరిస్తుందా?
బుధవారం హైకోర్టు తీర్పుపై కొనసాగుతున్న ఉత్కంఠ
సీబీఐ వాదనలు ఇవే:
విచారణకు అసలు అవినాష్ సహకరించడం లేదని.. ఎప్పుడు నోటీసులు ఇచ్చినా సమయం కావాలని కోరుతున్నారని.. దర్యాప్తును జాప్యం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని.. సీబీఐ తరఫు లాయర్ కోర్టులో వాదించారు. నిందితులు రెండు రకాల నేరాలకు పాల్పడ్డారని.. ఒకటి వివేకా హత్యకు కుట్ర.. మరోకటి క్రైమ్ సీన్ డిస్ట్రక్షన్. దర్యాప్తు మా పద్ధతి ప్రకారం చేస్తాం కానీ.. అవినాష్ కోరుకున్నట్టు కాదు.. ఈ కేసులో ఇప్పటివరకు ఎంతో మందిని విచారించాం.. కొందరిని అరెస్టు చేశాం. మిగతావారికి లేని ప్రత్యేక పరిస్థితి అవినాష్కు ఏమిటి? రాజకీయ ఉద్దేశాలే వివేకా హత్యకు ప్రధాన కారణమని తెలిపింది సీబీఐ.హత్యకు నెల రోజుల ముందు నుంచే కుట్ర ప్రారంభమైందని.. కడప ఎంపీ టికెట్ విజయమ్మ లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారని.. వివేకాపై రాజకీయంగా పైచేయి సాధించాలని అవినాష్ భావించారని కోర్టుకు తెలిపారు సీబీఐ తరఫు లాయర్. శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ద్వారా అవినాష్ కుట్ర అమలు చేశారని.. వివేకాపై కోపం ఉన్న వారిని గంగిరెడ్డి కుట్రలోకి లాగి హత్య చేయించారని.. శత్రువుకి శత్రువు మిత్రుడనే విధానం అనుసరించారని సీబీఐ వాదించింది. అవినాష్ రెడ్డి నుంచే డబ్బులు వచ్చాయని దస్తగిరి చెప్పాడని.. అవినాష్ డబ్బులు శివశంకర్రెడ్డికి ఇస్తే.. ఆయన గంగిరెడ్డికి ఇచ్చాడని.. కోర్టుకు తెలిపింది సీబీఐ.
హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు:
హత్య జరిగిన రోజు తెల్లవారుజామున అవినాష్ రెడ్డి వాట్సప్లో ఎవరితో మాట్లాడారు? అవినాష్ వాట్సప్లో ఉన్న సమయంలో గంగిరెడ్డి వాట్సప్ కూడా బిజీగా ఉందా? భారీ కుట్రలో అవినాష్ ప్రమేయం ఉన్నట్లు సీబీఐ ఎప్పటినుంచో అనుమానిస్తోంది కదా.. మరి అవినాష్ రెడ్డి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారా? కీలక అంశాలపై ఇంత నత్త నడక దర్యాప్తు ఏమిటి? సామాన్యుల కేసుల్లోనూ ఇంత సమయం తీసుకుంటారా? అని సీబీఐ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది హైకోర్టు.
వాట్సప్ కాల్ మాట్లాడినట్టు మాత్రమే తెలుస్తోందని.. అయితే, ఎవరితో మాట్లాడారో ఇంటర్నెట్ ద్వారా గుర్తించలేమని.. ఎవరితో మాట్లాడారో తెలుసుకునేందుకే అవినాష్ను విచారించాలని అనుకుంటున్నామని కోర్టుకు తెలిపింది సీబీఐ. అవినాష్ రెడ్డి ఐపీడీఆర్ (ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డు) డేటా సేకరించామని వెల్లడించింది. హత్య జరిగిన రోజు అవినాష్రెడ్డి జమ్మలమడుగు వెళ్తున్నట్లు చెప్పారని.. అది తప్పుడు సమాచారమని.. ఆ రోజు జమ్మలమడుగులో అవినాష్ ఎన్నికల షెడ్యూల్ లేదని సీబీఐ తెలిపింది.
ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. అవినాష్ తల్లి అనారోగ్యం దృష్టిలో పెట్టుకుని.. ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును ఈ నెల 31కి వాయిదా వేసింది. అప్పటివరకు అవినాష్పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.