FarmHouse Case: వీక్లీ సీరియల్ గా వాయిదా పడుతోంది కేసు. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పు పదే పదే ఉత్కంఠ రేపుతోంది. కేసులో కీలకంగా మారిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ ఆయుర్వేద వైద్యుడు జగ్గుస్వామిలకు సిట్ నోటీసులు ఇవ్వడం.. వారు హైకోర్టును ఆశ్రయించడం.. వారి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వాదిస్తుండటం.. సిట్ సైతం సుప్రీం లాయర్ ను రంగంలోకి దింపడం.. ఇలా అత్యంత ఆసక్తికరంగా మారుతోంది ఫాంహౌజ్ కేసు.
బీఎల్ సంతోష్ కు ఇచ్చిన సిట్ నోటీసులపై హైకోర్టు ఇప్పటికే స్టే విధించగా.. తాజాగా మరోసారి పొడిగించింది. బీఎల్ సంతోష్ కు ఇచ్చిన నోటీసులపై స్టే ఎత్తివేయాలని అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే, సంతోష్ నిందితుడు కాకపోయినా 41ఏ సీఆర్పీసీ కింద నోటీసు ఇవ్వడాన్ని తప్పుపట్టిన ఆయన తరపు న్యాయవాది తప్పుబట్టారు. 41ఏ కింద నోటీసులు ఇవ్వడం తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని, తమ వాదనలు విన్న తర్వాతే కోర్టు నిర్ణయం తీసుకోవాలని వాదించారు.
దీంతో, ఇరువర్గాలు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఈ నెల 13కు వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకూ సంతోష్ కు సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే కొనసాగుతుందని తెలిపింది.
మరోవైపు, జగ్గుస్వామికి సిట్ నోటీసులపైనా స్టే విధించింది న్యాయస్థానం. ఈ నెల 13 వరకు వారిద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సిట్ ను ఆదేశించింది హైకోర్టు. వచ్చే వారం తుది తీర్పు వెలువడే అవకాశం ఉండటంతో.. న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉండబోతుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సంతోష్ కు సిట్ నోటీసుల నుంచి విముక్తి వస్తుందా? లేదంటే, సిట్ విచారణకే గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా?