Kamareddy : కామారెడ్డి మాస్టర్ప్లాన్ వ్యతిరేకంగా ఒకవైపు రైతులు పోరాటం కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో మాస్టర్ ప్లాన్ ను అమలు నిలిపివేయాలని కోరూతూ హైకోర్టులోనూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేప్టటిన హైకోర్టు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ కాదని హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ల విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని ధర్మాసనం పేర్కొంది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి వివరించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై వేసిన పిటిషన్ విచారణను ఈనెల 25కి హైకోర్టు వాయిదా వేసింది.
మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వ్యతిరేకిస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనకు బీజేపీ నేత వెంకటరమణారెడ్డితోపాటు కాంగ్రెస్, తెలంగాణ జన సమితి, వైఎస్ఆర్ టీపీ నేతలు మద్దతు తెలిపారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు కోసం రైతులు తెలిపిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నా నేపథ్యంలో ఆయా గ్రామాలకు చెందిన రైతు సంఘం ప్రతినిధులను ముందస్తుగా అరెస్టు చేశారు. కొందరు రైతు నాయకులు తప్పించుకుని మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ నేపథ్యంలో కొన్నిరోజులుగా కామారెడ్డిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్యమం తీవ్రరూపం దాల్చింది.