Santhosh : బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు చిక్కులు తప్పేలా లేవు. ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నేరుగా సంతోష్ నే టార్గెట్ చేసింది. ఈనెల 21న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. అయితే, అవి ఆయనకు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించట్లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది సిట్. పిటిషన్ ను విచారించిన ఉన్నత న్యాయస్థానం.. సంతోష్ కు నోటీసులు ఇవ్వడానికి సిట్ కు ఢిల్లీ పోలీసులు సహకరించాలని ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని సిట్ కు సూచించింది.
మరోవైపు, బీఎల్ సంతోష్, శ్రీనివాస్ లకు సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు. సిట్ నోటీసులపై స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సంతోష్ ను అరెస్ట్ చేయొద్దని సిట్ ను ఆదేశించింది.