Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతించింది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి యాత్ర చేపట్టేందుకు సంజయ్ వెళ్తుండగా ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
హైకోర్టు షరతులివే
యాత్ర ప్రారంభం సందర్భంగా బీజేపీ నిర్వహించే సభ భైంసాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటేనే అనుమతించాలని పోలీసులకు స్పష్టం చేసింది. 3 వేల మందితోనే సభ నిర్వహించాలని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యే సభ నిర్వహించుకోవాలని సూచించింది. పాదయాత్ర నిర్మల్ మీదుగా కొనసాగించాలని ఆదేశించింది. 500తోనే యాత్ర సాగించాలని హైకోర్టు ఆదేశించింది. కార్యకర్తలు కర్రలు, ఆయుధాలు పట్టు కెళ్లకూడదని నిర్దేశించింది. అయితే హైకోర్టు షరతుల తర్వాతా బీజేపీ నేతలు తమ కార్యక్రమాలు మంగళవారానికి వాయిదా వేశారు.
పిటిషనర్ల తరఫున న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపించారు. భైంసా పట్టణం మీదుగా పాదయాత్ర వెళ్లదని తెలుపుతూ రూట్మ్యాప్ వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు. పట్టణంలోని ప్రవేశించకుండా వై జంక్షన్ నుంచి మాత్రమే కొనసాగుతుందని వివరించారు. భైంసా పట్టణంలోకి పాదయాత్ర వెళ్లనప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. ఆ ప్రాంతం చాలా సున్నితమైందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సంజయ్ పాదయాత్రకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు బైంసాలోని ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభా స్థలి వద్ద ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ వద్ద బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. అక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకున్నారు. రెండురోజులపాటు బైంసాలో 144 సెక్షన్ విధించారు.