నారాయణపేట జిల్లా.. కోస్గి మున్సిపాలిటీ(Kosgi Municipality) వ్యవహరం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు అవిశ్వాస తీర్మానం(No Confidence Motion) ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సవాల్ చేస్తూ.. ఛైర్ పర్సన్ శిరీష..హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అవిశ్వాస తీర్మాన ప్రక్రియను అడ్డుకోవాలని కోరుతూ పిటిషన్ వేయగా.. హైకోర్టు పిటిషన్ అనుమతించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఎన్నికల అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి.. నారాయణ పేట్ కలెక్టర్ కు, కోస్గి మున్సిపల్ కమిషనర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
అయితే మరోవైపు ముందుగా ప్రకటించిన ప్రకారం ఉదయం 11 గంటలకు అవిశ్వాసంపై బల పరీక్ష జరగగా.. ఉన్న 14 మంది సభ్యుల్లో 10 మంది ఛైర్ పర్సన్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే కోర్టు ఆదేశాలతో ఈ ఆవిశ్వాస తీర్మానానికి ఇప్పుడు బ్రేక్ పడింది. తెలంగాణ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తూ ఊహించని ఝలక్ ఇస్తున్నారు. కానీ హైకోర్టు ఆదేశాలతో ఛైర్ పర్సన్ శిరీష.. ప్రస్తుతానికి బయటపడ్డారని కౌన్సిలర్లు అంటున్నారు.
కోస్గి మున్సిపాలిటీలో మొత్తం 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో 3వ వార్డు సభ్యురాలు మృతి చెందగా.. 10వ వార్డు సభ్యుడిపై అనర్హత వేటు పడింది. దాంతో 14మంది కౌన్సిలర్లతోనే అవిశ్వాసం తీర్మానం కొనసాగింది. ముందుగా మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి వార్డు కౌన్సిలర్లు నోటీసులిచ్చారు. అవిశ్వాసంపై చర్చకు ప్రత్యేక అధికారిగా ఆర్డీవో రామచందర్ నియమితులయ్యారు. ఎన్నికలకు ముందు ఒకరు.. ఇటీవలే మరో ఇద్దరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. దాంతో ఛైర్ పర్సన్ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకునే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.