TCongress : తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభంపై ఏఐసీసీ దృష్టి పెట్టింది. సమస్యను పరిష్కరించే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ దిగ్విజయ్ సింగ్కు అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ అడ్వైజర్గా నియమించింది. టీకాంగ్రెస్ కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య కుదర్చాలని ఆదేశించింది. పార్టీ అప్పగించిన బాధ్యతలతో వెంటనే రంగంలోకి దిగిన దిగ్విజయ్ యాక్షన్ షూరు చేశారు. టీ కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ల సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు.
మంగళవారం సాయంత్రం మహేశ్వర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ సీనియర్లు భేటీ కావాల్సి ఉంది. అయితే దిగ్విజయ్ సింగ్ ఫోన్తో కాంగ్రెస్ సీనియర్లు వెనక్కి తగ్గారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం వాయిదా పడింది. మరోవైపు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో మహేష్ గౌడ్, కోదండరెడ్డి భేటీ అయ్యారు. సాయంత్రం సీనియర్ల సమావేశం వాయిదా వేయాలని కోరారు. అటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ..భట్టి విక్రమార్క కు ఫోన్ చేశారు. ఏఐసీసీ దూతలు కేసీ వేణుగోపాల్ , దిగ్విజయ్ ..ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశారు. తొందర పడొద్దని హితవు పలికారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ కమిటీలు చిచ్చురేపాయి. కమిటీల్లో సీనియర్ నేతలకు అన్యాయం జరిగిందని.. ఏకపక్షంగా కమిటీలు వేశారని కొందరు టీ కాంగ్రెస్ సీనియర్లు టీపీసీసీపై తిరుబావుటా ఎగరేశారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి కమిటీల్లో ఎక్కువ పదవులు కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. సీనియర్ల ఆరోపణలకు కౌంటర్గా టీడీపీ నుంచి వచ్చిన 12 మంది కాంగ్రెస్ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో టీ- కాంగ్రెస్లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై అధిష్టానం ఫోకస్ చేసింది.
మరోవైపు రాహుల్ గాంధీని కలిసేందుకు మాణిక్యం ఠాగూర్.. రాజస్థాన్ లోని అల్వార్ కి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత వ్యవహారాలు, విభేదాలు, సీనియర్ల అలక ఇలాంటి అంశాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. మాణిక్యం ఠాగూర్ ఇప్పటికే.. మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి పలు విషయాలను చర్చించారని తెలుస్తోంది. తెలంగాణ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం.. పార్లమెంట్ సమావేశాలు ముగియగానే ఏఐసీసీ సమావేశం నిర్వహిస్తుందని తెలుస్తోంది.
రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఇప్పటికే రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్.. త్వరలో హైదరాబాద్కు వస్తారని సమాచారం. పార్టీ నేతలతో భేటీ అయ్యి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించనున్నారు. ప్రస్తుతానికైతే సీనియర్లు కాస్త వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది. దిగ్విజయ్ తో భేటీ తర్వాత సీనియర్ల యాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి.