Khammam Congress Meeting : ఖమ్మం జన గర్జన బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభ నుంచే అసెంబ్లీ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించాలని భావిస్తోంది. ఈ మీటింగ్ తెలంగాణ రాజకీయాలను కీలక మలుపు తిప్పుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జన గర్జన సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు సంకల్పించారు.
100 ఎకరాల ప్రాంగణంలో సభా స్థలిని సిద్ధం చేశారు. ఈ సభకు 5 లక్షల మంది జనం తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేశారు. హైటెక్ సదుపాయాలు సమకూర్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వర్చువల్ స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇలాంటి స్క్రీన్ను బహిరంగ సభల్లో మొదటిసారి వినియోగిస్తున్నారు.
మామూలుగా సినిమా ప్రమోషన్స్ జరిగే ఈవెంట్స్ లో వర్చువల్ స్క్రీన్ను వాడతారు. వేదిక వద్ద 40 అడుగుల ఎత్తులో స్క్రీన్ను ఏర్పాటు చేశారు. హై డెఫినిషన్ సౌండ్తోపాటు, వర్చువల్ వీడియో అనుభూతి లభించనుంది. బహిరంగ సభను చూసే వారికి సినిమా ఈవెంట్ తరహాలో అనుభూతి కలగనుంది. ఆడియోకు తగ్గట్లుగా స్క్రీన్ పై వీడియో డిస్ప్లే చేస్తారు. భారీగా జనం వస్తుండటం వల్ల వాళ్లందరికీ స్క్రీన్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకోసమే వర్చువల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు.