KP Chaudhary drugs case(Celebrity news today): నిర్మాత కేసీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు నమోదు చేసిన రిమాండ్ రిపోర్టులో ప్రముఖల యవ్వారం వెలుగుచూస్తోంది. కేపీ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 12 మంది పేర్లను ప్రస్తావించారు పోలీసులు. ఆ డజను మందిలో టాలీవుడ్ ప్రముఖుల పిల్లలు, రాజకీయ నేతల కొడుకులు ఉన్నారు. సిక్కిరెడ్డి ఇంట్లో తరుచూ డ్రగ్స్ పార్టీ నిర్వహించేవారని తేలింది. రఘుతేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేష్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగోర్ ప్రసాద్తో పాటు మరికొంత మందికి డ్రగ్స్ విక్రయించినట్టు కేపీ చౌదరి అంగీకరించినట్టు సమాచారం.
ఇక, కేపీ చౌదరి ఫోన్ హిస్టరీ డీకోడ్ చేస్తే మరిన్ని ఆసక్తికర పేర్లు తెలిశాయి. నటి ఆషురెడ్డితో వందలాది కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. జ్యోతి, సురేఖవాణిలతో కూడా కేపీ.. ఫుల్ కాంటాక్ట్లో ఉన్నట్టు తేల్చారు. ఇక, బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన ఓ హీరోయిన్, పలు టాలీవుడ్ మూవీస్ లో ఐటమ్స్ సాంగ్ చేసిన మరో హీరోయిన్తో కేపీ చౌదరి వందలాది కాల్స్ మాట్లాడినట్టు ఫోన్ రికార్డ్స్ బట్టి తెలుస్తోంది. అయితే, ఆ హీరోయిన్స్తో మాట్లాడింది డ్రగ్స్ కోసమేనా? ఇంకేదైనా యవ్వారమా అనేది తేల్చే పనిలో ఉన్నారు.
అయితే, కేపీ చౌదరి చెప్పింది కొందరి పేర్లు మాత్రమేనని.. ముందుముందు విచారణలో మరింతమంది పేర్లు బయటకు వస్తాయని అంటున్నారు. హైదరాబాద్, గోవాలో నిర్వహించిన ప్రైవేట్ పార్టీల వివరాలతో పాటు.. ఆయా పార్టీలకు ఎవరెవరు వచ్చారనే సమాచారం సేకరించారు. కేపీ బ్యాంక్ లావాదేవీలను పరిశీలించారు. కేపీ అకౌంట్లో 11 అనుమానాస్పద ట్రాన్జాక్షన్స్ గుర్తించారు.
విచారణలో తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని ఒప్పుకున్నారు కేపీ చౌదరి. అయితే తాను ఏ సెలబ్రిటీకి డ్రగ్స్ సరఫరా చేయలేదని చెప్పారు. తన ఫోన్లో సెలబ్రిటీల ఫోటోలు మాత్రమే ఉన్నాయని బుకాయించాడు. అతని ఫోన్లు డీకోడ్ చేస్తే.. అసలు తతంగం అంతా బయటకొస్తోంది.