హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే హైడ్రా అని అర్థం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చి, చెరువులను పరిరక్షించేందుకు తెచ్చిన ఓ స్వతంత్ర సంస్థ. దీనికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
రంగనాథ్ అంత పవర్ ఫుల్ ఆ…
మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన సంస్థకు కమీషనర్ అంటే ఆ స్థాయిలోనే పవర్ ఫుల్ అయ్యింటారు కదా. నిజమే మరి. హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ ఐపీఎస్ అంటే పవర్ ఫుల్ ఏ కాదు, యమ స్ట్రిక్ట్. అంతే సిన్సియర్ కూడాను. అందుకే తెలంగాణలో ఎందరో సీనియర్ ఐపీఎస్ ఉన్నతాధికారులున్నా హైడ్రా సారథిగా 2006 ఐపీఎస్ బ్యాచ్, రంగనాథ్ మాత్రమే సీఎంకు కనిపించారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ముక్కుసూటితనం, చెప్పిన పని చెప్పినట్టుగా చేయడం, చట్టాలను పాటించడం, పేదలకు న్యాయం చేయడం, అక్రమార్కులు ఎంతటి వారైనా పట్టించుకోకుండా దూసుకెళ్లేతత్వమే ఆయనకు బలం.
ఐజీపీ-1గా దడపుట్టించారు…
గత జూన్ వరకు మల్డీజోన్-1 ఐజీపీగా ఉత్తర తెలంగాణకు అద్భుతమైన పోలీసింగ్ అందించిన రంగనాథ్, తప్పు చేసిన పోలీస్ అధికారుల తాట తీశారు. తప్పు చేసినట్టు తేలిన పోలీసు ఎవ్వరైనా సరే ఇట్టే సస్పెండ్ అయ్యారు. ఈ చర్యలతోనే పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం, ధైర్యం, భరోసా కలిగేలా ఆయన వ్యవహరించారు. అలాంటి ఆయన ఉన్నఫలంగా బదిలీ కావడం సంచలనమైంది.
కారణాలు ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత గానీ జనాలకు తెలిసిరాలేదు. అంతకు మించిన గురతర బాధ్యతలను స్వీకరిస్తారని. హైడ్రా చీఫ్ గా ఆయనుంటేనే మహానగరంలో కబ్జారాయుళ్లు బెంబెలెత్తిపోతారు. ప్రభుత్వ భూమి తిరిగి ఖజానాలో జమ అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు.
ఎవరీ రంగనాథుడు…
రంగనాథ్ పూర్తి పేరు ఏవీ రంగనాథ్. ఆవుల వెంకట్ రంగనాథ్ నల్గొండ జిల్లాకు చెందినవారు. 1970 అక్టోబర్ 22న సుబ్బయ్య, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. హుజూర్నగర్ తదితర ప్రాంతాల్లో పాఠశాల విద్యాభ్యాసం చేశారు. పదో తరగతి మాత్రం గుంటూరులో పూర్తి చేశారు. తర్వాత హైదరాబాద్లోనే ఇంటర్ చదువుకున్నారు.
ఓయూలో బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రంగనాథ్, బెంగళూరులోని ఐడీబీఐ బ్యాంకులో కొద్దికాలం పని చేశారు. కేంద్ర ప్రభుత్వ బ్యాంకులో పని చేస్తున్నా సరే ఆయనలో ఏదో వెలితి. దీంతో ఆయన మనసు గ్రూప్-1పై పడింది. అనుకున్నదే తడవుగా, ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష రాశారు. రాయడమే కాదు రాష్ట్ర స్థాయిలో 13వ ర్యాంక్ కొట్టగలిగారు.
2006 బ్యాచ్ ఐపీఎస్…
పోలీస్ కావాలన్న ఆకాంక్షతోనే ఆయన డీఎస్పీగా ఎంపికయ్యారు. 1996 బ్యాచ్లో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2000లో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా నియమితులయ్యారు.
తర్వాత కొత్తగూడెం డీఎస్పీగా 2003 వరకు పనిచేశారు. అనంతరం వరంగల్ జిల్లా నర్సంపేటకు ట్రాన్స్ ఫర్ అయ్యారు.
ఇక 2004 ఎన్నికల వేళ మావోయిస్టుల కంచుకోట ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ సమర్థంగా పని చేశారు. వైఎస్ఆర్ కాలంలో నక్సల్స్ తో జరిగిన చర్చల ఫలితంగా కేంద్ర నాయకుడు రామకృష్ణను జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు.
also read : పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. మూసీ భాదితులకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తామన్న మంత్రి
రాష్ట్రపతి అవార్డు గ్రహీత…
2012 వరకు తూర్పు గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడే గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా వ్యవహరించి శభాష్ అనిపించుకున్నారు. రంగనాథ్ పనితీరుకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు సైతం దక్కింది. 2014 వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసిన ఆయన అక్కడి నుంచి నల్గొండకు బదిలీ అయ్యారు. దాదాపు 4 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయేషా మీరా హత్య కేసు, అమృత-ప్రణయ్ కేసుల విచారణ, దర్యాప్తును ఏవీ రంగనాథ్ పకడ్బందీగా నిర్వహించారు. ఎస్పీగా ఉండగానే డీఐజీగా పదోన్నతి రాగా, తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.
ట్రాఫిక్ సమస్యలపై కొరడా…
మహానగర ప్రజలను పీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటైన ట్రాఫిక్ ను గుర్తించి కొరడా ఝులిపించారు. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ లోక్ అదాలత్ను సైతం నిర్వహించి కేసులను క్లియర్ చేయించడంలో కీలక పాత్ర పోషించారు.
వరంగల్ సీపీగా రంగనాథ్ రాణించారు.
తెలంగాణలోనే రెండో అతిపెద్ద నగరంగా పేరుగాంచిన వరంగల్ లో భూకబ్జాలు, అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపారు. కబ్జా భూములను విడిపించి, హక్కుదారులకు అప్పగించారు. బాధితులే ఒక పోలీస్ అధికారి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారంటే ఆయన పనితీరును అంచనా వేయొచ్చు. అందుకే రంగనాథ్ ను హైడ్రాకు బాస్ గా నియమించిందని తెలుస్తోంది.