Heavy traffic jam at Srisailam Project with visitors seeing water falls: ద్వాదశ జ్యోతిర్లింగాలలోనే అత్యంత శక్తివంతమైన రెండవ పీఠంగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని పూజిస్తారు. తెలుగు రాష్ట్రాల భక్తులు తిరుపతి తర్వాత శ్రీశైలం దర్శనానికికి ఉవ్విళ్లూరుతుంటారు. ఇక హైదరాబాద్ నుంచి కేవలం 200 కిలీమీటర్ల పరిధిలో ఉన్న శ్రీశైలం దర్శించుకోవడానికి సొంత వాహనాలలో వస్తుంటారు భక్తులు. కేవలం మూడు నుంచి నాలుగు గంటల ప్రయాణం కావడంతో ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. మామూలు రోజుల్లోనే శని, ఆదివారాలు బాగా రద్దీగా ఉంటుంది శ్రీశైలం.
ప్రకృతి అందాలను వీక్షించేందుకు
భక్తితో శివుడి దర్శనం చేసుకున్నాక అక్కడ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తుంటారు. సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, జలపాతాలతో సహా శ్రీశైలం ప్రాజెక్టు అందాలను వీక్షించేందుకు ఎక్కడెక్కడ నుంచో వచ్చి చేరుకుంటారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో గత జులై నెలలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. పైగా ఎగువ ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు దిగువ ప్రాంతంలో ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాముల వద్ద జల కళ సంతరించుకుంది. దీనితో దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. గేట్లు ఎత్తినప్పుడు పరవళ్లు తొక్కే కృష్ణమ్మ అందాలు వర్ణించడానికి రెండు కళ్లూ చాలవు. అందుకే ప్రత్యేకంగా ఈ సీజన్ లో భక్తులు, పర్యాటకులు శ్రీశైలం రావడానికి మక్కువ చూపుతుంటారు.
వీకెండ్ రద్దీతో ట్రాఫిక్ జామ్
వీకెండ్ కావడంతో శని, ఆదివారాలు శ్రీశైలం ప్రాజెక్టుకు జనం తాకిడి ఎక్కువయింది. దీనితో హైదరాబాద్, శ్రీశైలం సరిహద్దు ప్రాంతమైన నాగర్ కర్నూల్ జాతీయ రహదారిపై కిలీమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన వటవర్లపల్లి, మన్ననూరు, ఈగల పెంట, దోమల పెంట ప్రాంతాలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలతో పెద్ద సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి. ముందుకు, వెనక్కి కదిలే పరిస్థితి లేకపోవడంతో గంటల తరబడి ప్రయాణికులు ఇరుక్కుపోయారు.
ట్రాఫిక్ పోలీసుల తంటాలు
దాదాపు 20 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ వాహనాల మధ్యలో అంబులెన్స్ ఇరుక్కుపోవడంతో అంబులెన్స్ సిబ్బంది ఆందోళన పడ్డారు. అతి కష్టం మీద అంబులెన్స్ ను పోలీసులు, వాహనదారుల సహకారంతో బయటకు తెచ్చారు. దోమల పెంట చెక్ పోస్ట్ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పది నిమిషాల ప్రయాణం పది గంటల పాటు చేయవలసి వస్తోందని ప్రయాణికులు ఆందోళన చేశారు.ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను తరలిస్తూ నానా తంటాలు పడ్డారు.