IMD Weather Update: తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ శాఖ వెల్లడించింది. సోమవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉందని తెలిపింది. దీంతో మంగళ, బుధవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్, ఆసిపాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, ములుగు, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు మరి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మిగతా ప్రాంతాల్లో ఉరుములు, మెరపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం వరకూ పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, జగిత్యాలతో పాటు పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని తెలిపింది. నిర్మల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, నిజామాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో 24 గంటల్లో భారీ వర్షాలు, కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని తెలిపింది, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ప్రదేశ్ లకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది, ముంబాయిలో భారీ వర్షాల దెబ్బకు జనజీవనం స్తంభించిన విషయం తెలిసిందే. అస్సాం, మేఘాలయాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
జూలై 12 న పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది, బిహార్ లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్లో మాత్రం జూలై 11 వరకు పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని అంచనా వేసింది. జూలై 12న ఢిల్లీ, హర్యానా జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘడ్ లో కూడా జడివాన కురవవచ్చని పేర్కొంది.
Also Read: దూకుడు పెంచిన ఏసీబీ.. గొర్రెల స్కాం విచారణ వేగవంతం
ముంబాయిలో పాఠశాలలకు నేడు బీఎంసీ సెలవు ప్రకటించింది. మరోవైపు పుణేలో కూడా 12 వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. రాయగడ్ లో కూడా పలు ప్రాంతాలు జలమయం కావడంతో కాలేజీలకు సెలవులు ప్రకటించారు. పాట్నా, థానే, నాసిక్ ,షోలాపూర్, జాల్నా, చంద్రపూర్ లో నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.