తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరికొన్ని రోజులు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. మరో 5 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణశాఖ తెలిపింది. అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరోవైపు భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 170 బస్తీలు, 30కి పైగా కాలనీలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. చాలాచోట్ల ఇళ్లల్లోకి వరద చేరింది . మరోవైపు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
మరోవైపు మూసీనదికి వరద పోటెత్తడంతో నీరు రోడ్లపైకి వస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. మూసీలో అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వంతెనను ఆనుకొని నీరు ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాదర్ఘాట్ కాజ్ వే వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాజ్ వే వంతెనను మూసివేశారు. వరద ఉద్ధృతి పెరగడంతో ఈ రెండు బ్రిడ్జిలను తాత్కాలికంగా మూసివేశారు.
భారీ వర్షానికి మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని మైసమ్మగూడ ఏరియా నీట మునిగింది. మల్లారెడ్డి యూనివర్సిటీలోకి భారీగా వరద చేరింది. వర్సిటీ హాస్టళ్లు సహా మరికొన్ని ప్రైవేట్ హాస్టళ్లలో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయి. దాదాపు 20 హాస్టల్స్ లో చిక్కుకున్న స్టూడెంట్లను మున్సిపల్, పోలీస్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మల్లారెడ్డి విద్యాసంస్థలకు 4 రోజులపాటు సెలవులు ప్రకటించారు. దీంతో స్టూడెంట్స్ కట్టుబట్టలతో సొంతూళ్లకు వెళ్లిపోయారు.