Rain updates in telangana(Telangana weather news telugu): తెలంగాణలో వచ్చే ఐదురోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. వరంగల్, హన్మకొండ, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీనియర్ అధికారులతో ప్రభుత్వ సీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్తగూడెం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, వరంగల్, సిద్ధిపేట, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ మాట్లాడారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితులునైనా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను ముందుగానే గుర్తించాలన్నారు.
పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ సూచించారు.కలెక్టరేట్లు, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు.భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదలశాఖ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.