Rains: వాతావరణ శాఖ ముందే చెప్పింది. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు వానలు పడతాయని సూచించింది. ఓవైపు ఎండ దంచుతుంటే.. ఇప్పుడు వానలేంటి? అని వెదర్ రిపోర్ట్ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ 16వ తేదీ రానే వచ్చింది. ఉదయం ఫుల్ ఎండ కొట్టింది. ఇంకేం వాన పడుతుందిలే అని అంతా ఎవరి పనులకి వాళ్లు వెళ్లిపోయారు. కానీ, మధ్యాహ్నానికల్లా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సడెన్గా మేఘాలు కమ్మేశాయి. సూర్యుడు మరుగున పడ్డాడు. ఎండ పోయి నీడ వచ్చింది. కాసేపట్లోనే చల్లటి గాలులు మొదలయ్యాయి. ఇదేంటి? ఈ సడెన్ ఛేంజ్ ఏంటి? అని పబ్లిక్ ఆశ్చర్యపోయారు.
అంతలోనే గాలులు కాస్తా ఈదురు గాలులుగా మారాయి. ఉరుములు, మెరుపులు వినిపించి కనిపించాయి. సడెన్గా వర్షం ముంచెత్తింది. చూస్తుండగానే వాన దంచి కొట్టింది. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. వాతావరణం పూర్తిగా చల్లబడింది.
హైదరాబాద్లోనే కాదు. సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్ఖేడ్, చేవెళ్ల లాంటి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా వెదర్ కూల్గా మారింది. అనేక జిల్లాల్లో వానలు పడుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ నుంచి ఝార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ద్రోణి ఏర్పడింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకూ మరో ద్రోణి ఏర్పడటంతో.. బంగాళాఖాతం నుంచి తేమ గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ద్రోణి ప్రభావంతో గురువారం తెలంగాణ వ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సమయంలో గాలులు వేగం గంటకు 30 నుంచి 40 కి.మీల మేర ఉంటుందని.. వడగళ్ల వాన పడొచ్చనేది లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. ఆంధ్ర, రాయలసీమలోనూ పలుచోట్ల వానలు కురుస్తాయని తెలిపింది. రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హైదరాబాదీలు వానంటే హడలిపోతున్నారు. డ్రైనేజీలు పొంగుతాయని, ట్రాఫిక్ జామ్లు అవుతాయని తెగ టెన్షన్ పడుతున్నారు. వాతావరణం చల్లబడిందని సంతోషించాలో.. వానకు ట్రాఫిక్లో చిక్కుకుపోతామని భయపడాలో తెలీని పరిస్థితి.