Biker Dead in Sameerpet :హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని ఎల్బీనగర్, హిమాయత్ నగర్, నాగోల్, కుషాయిగూడ, కీసర, నాగారం, బీఎన్ రెడ్డి నగర్, అబ్దుల్లాపూర్ మెట్, అంబర్ పేట్, చాంద్రాయణ గుట్టలలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వారంరోజులుగా మండుటెండలతో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా పడిన వర్షంతో ఉపశమనం పొందారు.
శామీర్ పేటలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలుల ధాటికి ఒక చెట్టు విరిగిపడింది. అదే సమయంలో అటువైపుగా బైక్ పై చెట్టు విరిగి పడటంతో.. బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు యాదాద్రి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రామ్ రెడ్డిగా గుర్తించారు. ఈదురుగాలులు, భారీ వర్షాల నేపథ్యంలో ఎవరూ బయటకు రావొద్దని, చెట్ల కింద అస్సలు ఆగవద్దని అధికారులు సూచించారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ పశ్చిమ బెంగాల్ తీరంవైపుగా దూసుకెళ్తోంది. ఈ తుపాను ఆదివారం అర్థరాత్రి తర్వాత సాగర్ ద్వీపం – ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్ ను ఆనుకొని ఉన్న పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది.