– దసరా వేళ.. దగాపై పోరు
– యువతకు హరీష్ రావు పిలుపు
– వృద్ధాప్య పింఛన్ ఊసే లేదు
– నిరుద్యోగ భృతి ఇంకెప్పుడో?
– రైతుబంధు, రైతు భరోసా లేనట్టేనా?
– పండగ వేళ యువత వీటిపై చర్చించండి
– హస్తం నేతలను నిలదీయండి
హైదరాబాద్, స్వేచ్ఛ: దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై యువత చర్చించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. కాంగ్రెస్కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత కాంగ్రెస్ మోసాన్ని గుర్తించాలన్నారు. అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్, రైతు బంధు, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై అలయ్ బలయ్ సమయంలో యువత చర్చించాల్సిన అవసరముందని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
రైతుబంధు లేనట్టేనా?
నిరుడు దసరాకు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఈ ఏడునెలల పాలనపై సమీక్ష చేసుకోవాలని, పెండింగ్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని గమనించాలని కోరారు. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్, రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా అంశాలలో కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తించాలని సూచించారు.
Also Read: దసరాలోపే కేబినెట్ విస్తరణ.. కొండా సురేఖ ఔటా..?
నిరుద్యోగ భృతికి నీళ్లు
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ, ఏడు నెలలైనా ఇప్పటికి కేవలం అందులో సగం కూడా ఇవ్వలేదని హరీష్ మండిపడ్డారు. నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతికీ నీళ్లు వదిలారని, అందుకే ఈ పండుగ సమయంలో ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ - బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించాలని పిలుపునిచ్చారు. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్లపై ఎక్కడిక్కడ నేతలను నిలదీయాలని కోరారు.